కర్నాటకీయం: ట్రబుల్ షూటర్ విజయం...రెబెల్ ఎమ్మెల్యేను ఒప్పించిన డీకే శివకుమార్
Recommended Video
బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కుమార స్వామి ప్రభుత్వానికి ఢోకాలేకుండా చూసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. తాజాగా మరో సారి చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు శివకుమార్. రాజీనామా చేసిన హోస్కోటె కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజుతో చర్చలు జరిపిన తర్వాత తాను రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్తోనే ఉంటానన్న రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్
కర్నాటకలో సంకీర్ణ కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యే నాగరాజు తన రాజీనామాను ఉపసంహరించుకుని కాంగ్రెస్తోనే ఉంటున్నట్లు ప్రకటించారు. అంతకుముందు శనివారం ఉదయం నాగరాజ్ ఇంటికి చేరుకున్న ట్రబుల్ షూటర్ శివకుమార్ అతనితో చర్చలు జరిపారు. కాంగ్రెస్తోనే ఉండేలా ఆయన్ను ఒప్పించడం జరిగింది. తన నియోజకవర్గంలో పలు సమస్యలున్నాయని అది సీఎం కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పక్కన పెట్టి తనను పట్టించుకోలేదనే అసంతృప్తితో నాగరాజ్ ఉన్నారు. అయితే నాగరాజ్ డిమాండ్ను తప్పకుండా పరిష్కరిస్తామని డీకే శివకుమార్ హామీ ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నట్లు నాగరాజ్ తెలిపారు. పరిస్థితులు తమను రాజీనామా దిశగా నడిపాయని రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ తెలిపారు.
ముంబై నుంచి షిర్డీకి వెళ్లిన రెబెల్ ఎమ్మెల్యేలు
గత 8 రోజులుగా కర్నాటకలో రాజకీయ సంక్షోభం నడుస్తోంది. 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. మరోవైపు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై ఇప్పుడప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పీకర్ కేఆర్ రమేష్కు ఆదేశాలు జారీచేసింది. జూలై 16న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు ముంబైలో క్యాంపు వేసిన కాంగ్రెస్ జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు వారి పార్టీ పెద్దలకు అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటి వరకు ముంబైలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు షిర్డీ యాత్రకు బయలు దేరి వెళ్లారు.
ఎన్ని చర్చలు జరిపినా...ప్రభుత్వం కూలడం ఖాయం
ఇదిలా ఉంటే ఎన్ని చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కావని కుమారస్వామి సర్కార్ కూలడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షనేత యడ్యూరప్ప కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ముందుగా కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల్లో స్పష్టత లోపించిందని అందుకే వారి ఎమ్మెల్యేలు జారుకుంటున్నారని యడ్యూరప్ప అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకునేందుకు ఓ పద్దతి ప్రకారం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని అన్నారు.