మూకుమ్మడిగా చావడం ఖాయం..ఈ రాత్రికి ఎక్స్ట్రా లార్జ్ పెగ్ వేసి, పడుకోండి
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇక నిమిషాలను లెక్కిస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పక్షం బల పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుందంటూ స్పీకర్ రమేష్ కుమార్ రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో- సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ శాసన సభ్యుల ముఖాలు కళ తప్పాయి. బల నిరూపణ తప్పదనే భావనలో కూరుకుపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఈ అగాథం నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో- ఓ రకమైన నిరాశ వారిలో నెలకొంది. ప్రత్యేకించి- ట్రబుల్ షూటర్గా పేరున్న డికే శివకుమార్ సైతం ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వీడియో: తిరుమలలో నూతన గవర్నర్!
వెన్నుపోటు పొడిచారు..
తిరుగుబాటు ఎమ్మెల్యేలు అన్నంపెట్టిన చేతిని నరికారని ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై ఆయన మంగళవారం సభలో మాట్లాడారు. భారతీయ జనతాపార్టీలో తనకు కొందరు ఆప్తమిత్రులు ఉన్నారని, వారు కూడా తనను మోసం చేశారని ఆక్రోశించారు. తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేల్లో ఎంబీటీ నాగరాజ్ వంటి కొందరు నాయకులకు తాను అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి టికెట్ ఇప్పించి, గెలిపించుకున్నానని అన్నారు. ఇప్పుడు వారంతా తనను వెన్నుపోటో పొడిచారని డీకే శివకుమార్ చెప్పారు.
వెన్నుపోటు పొడవటం వెన్నతో పెట్టిన విద్య
ముంబైలో ఉంటోన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరితో తాను గత రాత్రి మాట్లాడానని, భారతీయ జనతాపార్టీ తనకు మంత్రి పదవి ఇస్తుందని ఆశ చూపెట్టిందని అన్నారు. ఆ ఆశతోనే తాను రాజీనామా చేశానని ఆ రెబెల్ ఎమ్మెల్యే తనతో చెప్పారని సభలో ప్రస్తావించారు. బీజేపీని ఎంత మాత్రమూ విశ్వసించవద్దని, ఆ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తారని తాను ఆ ఎమ్మెల్యేకు హెచ్చరించినట్లు చెప్పారు. అన్నం పెట్టిన తన చేతిని తిరుగుబాటు ఎమ్మెల్యేలు నరికేశారని, అదే విధంగా బీజేపీ నాయకులు కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా రెబెల్ ఎమ్మెల్యేలకు వెన్నుపోటు పొడవడం ఖాయమని అన్నారు.
బీజేపీని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం..
బీజేపీని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తాను తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు డీకే శివకుమార్ సభలో వెల్లడించారు. మూకుమ్మడిగా చావడం మాత్రం ఖాయమని, అందుకే- ఓ ఎక్స్ట్రా లార్జ్ పెగ్ వేసి, హాయిగా నిద్రపోవాలని తాను వారికి సూచించానని అన్నారు. ముంబైలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు నివసిస్తోన్న హోటల్లోనే తాను కూడా గదిని బుక్ చేసుకున్నప్పటికీ.. లోనికి కూడా రాకుండా అడ్డుకున్నారని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన మీద కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ.. తాము పెద్దగా బాధపడబోమని అన్నారు. రెబెల్స్కు బీజేపీ వెన్నుపోటు పొడవటాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తామని చెప్పారు.