బలనిరూపణకే సుప్రీంకోర్టు: రెబల్ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారంటూ కమల్ నాథ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలంతా తమవెంటే ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉండగా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ బలవంతంగా బెంగళూరులో బంధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున లాయర్ జోక్యం చేసుకుంటూ.. 16 మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సుప్రీంకోర్టు ముందు ప్రదర్శన నిర్వహిస్తామని కోరగా.. దీనికి ధర్మాసనం నిరాకరించింది.
మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, దీంతో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరులో బీజేపీ బంధించిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ తన పిటిషన్లో పేర్కంది.
కాగా, రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోద ముద్ర వేశారు. బలనిరూపణ నిర్వహించాలంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి రావాలని, అప్పుడే బలనిరూపణ పరీక్షకు అంగీకరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ఆ 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనా కాకపోయినా.. నిర్బంధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కాగా, ఒక వేళ కోరితే జడ్జీల ముందు ఆ 16 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు తాము సిద్ధమని బీజేపీ తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ తెలిపారు. అయితే, కోర్టు అందుకు అంగీకరించలేదు. రెబల్ ఎమ్మెల్యేలు భోపాల్ వెళితే వారిని కాంగ్రెస్ హార్స్ ట్రేడింగ్ చేసే అవకాశం ఉందని రోహిత్గీ తెలిపారు.
Recommended Video
తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపైనా తమకు అనుమానాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటికిప్పుడు బలనిరూపణ పరీక్ష చేయకుంటే భూమి బద్దలవడం లాంటి ప్రళయాలు ఏమీ సంభవించమని పేర్కొంది. కాగా, సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా బెంగళూరులో ఉన్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.