ఐఎస్ఐఎస్ రూ. 8 లక్షలు ఇచ్చింది: ముంబై టెక్కి
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) నుంచి సంబంధాలున్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ముదబ్బిర్ ముస్తాక్ షేక్ (34)కు ఉగ్రవాదుల నుంచి రూ. 8 లక్షలు అందాయని వెలుగు చూసింది.
ఈ విషయాన్ని ముస్తాక్ స్వయంగా ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ముస్తాక్ భారత్ నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నాడని ఆరోపణలు రావడంతో అతనిని అరెస్టు చేశారు. ముస్తాక్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు.
గత రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నిలిపివేసి ఐఎస్ఐఎస్ కోసం పూర్తిగా పని చేస్తున్నాడు. తాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సూచనల మేరకు ఓ వ్యక్తి దగ్గర రూ. 8 లక్షలు తీసుకున్నానని ముస్తాక్ ఎన్ఐఏ అధికారుల విచారణలో అంగీకరించాడు.
ఐఎస్ఐఎస్ నియామకాల కోసం ఆ డబ్బు ఖర్చుపెట్టినట్లు అంగీకరించాడు. లక్నోకు చెందిన యువకుడికి రూ. మూడు లక్షలు, హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తికి రూ. 50 వేలు ఇచ్చానని ముస్తాక్ అంగీకరించాడు. మిగిలిన సొమ్ము ఇతర రాష్ట్రాల్లోని యువకులకు పంపించానని అధికారులకు చెప్పాడు.
ముస్తాక్ చెప్పిన హుస్సేన్, లక్నో యువకుడిని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ముంబ్రా అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ముస్తాక్ గుట్టుచప్పుడు కాకుండా ఐఎస్ఐఎస్ కోసం పని చేస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.