బీజేపీకి రూ. 700 కోట్ల విరాళాలు: ఆ ఒక్క సంస్థ నుంచే భారీగా..
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థల నుంచి భారీగా విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందిన వివరాలను ఆ పార్టీ వెల్లడించింది. వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ. 700 కోట్లు అందాయని ప్రకటించింది.
రూ. 20వేలు, అంతకుమించిన విరాళాలను కేవలం ఆన్లైన్లోనే స్వీకరించినట్లు భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. అయితే, ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన మొత్తాన్ని ఈ విరాళాల్లో చేర్చలేదు.
చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల రూపంలో ఈ మొత్తం సమకూరిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే, ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్ నేతృత్వంలోని 'ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్' నుంచే వచ్చాయి. ఈ ట్రస్ట్ నుంచి రూ. 356 కోట్లు అందాయి.
ఇక భారతదేశంలో అత్యంత సంపన్న ట్రస్ట్ అయిన 'ఫ్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్' నుంచి రూ. 54.25 కోట్ల విరాళాలు బీజేపీకి అందాయి. భారతీ గ్రూప్, హీరో మోటాకార్ప్, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, ఓరియెంట్ సిమెంట్, డీఎల్ఎఫ్, జేకే టైర్స్ లాంటి ఇతర కార్పొరేట్ సంస్థలు బీజేపీకి విరాళాలు అందించిన వాటిలో ఉన్నాయి.