స్త్రీల కనీస వివాహ వయసు పెంపు...? మోదీ కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఎందుకీ నిర్ణయం...
భారత్లో స్త్రీల కనీస వివాహ వయసు పెంపును కేంద్రం పున:సమీక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాత కేంద్రం దానిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ అనంతరం మోదీ ప్రసంగించారు.
తొలి కాంగ్రెసేతర ప్రధాని: మరో రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ
మహిళా సాధికారతపై మోదీ...
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు చేపడుతున్న చర్యలను,సాధించిన విజయాలను వివరించారు. ఇప్పుడు నేవీ,ఆర్మీ రంగాల్లోనూ మహహిళలకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. 'మహిళలకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా... దాన్ని సద్వినియోగం చేసుకుని భారత్ గర్వపడేలా చేశారు.మహిళలకు స్వయం ఉపాధిలోనూ,ఉద్యోగ అవకాశాల్లోనూ సమాన అవకాశాలు కల్పించేందుకు దేశం నిశ్చయించుకుంది. ఇప్పుడు మహిళలు బొగ్గు గనుల్లోనూ పనిచేస్తున్నారు, అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.' అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల మంది పేద మహిళలకు జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు పంపిణీ చేసిందన్నారు.
వివాహ వయసు పెంపుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్...
ప్రస్తుతం భారతీయ స్త్రీల కనీస వివాహ వయసు 18గా,పురుషుల కనీస వివాహ వయసు 21గా ఉన్నది. అయితే స్త్రీల కనీస వివాహ వయసును కూడా కేంద్రం 3 లేదా 4 ఏళ్లు పెంచాలనే యోచనలో ఉంది. పురుషులతో సమాన విద్యా అవకాశాలు పొందడానికి స్త్రీలకు వివాహం ఒక అడ్డంకి కాకుండా ఉండేందుకు చట్టంలో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్యత రేటు, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను సమగ్ర పరిశీలనకు జూన్ 2న కేంద్రం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
లాజిక్ ఉందా...?
వివాహ వ్యవస్థకు సంబంధించి ఆయా మతాల చట్టాలు తమ సంప్రదాయ నిబంధనలనే ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో దాదాపుగా అబ్బాయిల కంటే అమ్మాయిల వివాహ వయసు తక్కువగా ఉంటుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. కేవలం సంప్రాదాయాల పేరుతో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారని గతంలో లా కమిషన్ వాదించింది. పురుషులు,స్త్రీల వయసు ఒకటే అయినప్పటికీ... స్త్రీలు పురుషుల కంటే పరిణతితో ఉంటారన్న వాదనను మహిళా యాక్టివిస్టులు గతంలో ఎన్నోసార్లు తప్పు పట్టారు. మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇంటర్నేషనల్ ట్రీటి కమిటీ కూడా దీన్ని తప్పు పట్టింది.
వివక్ష కాదా...?
స్త్రీ,పురుష వివాహ వయసులతో తేడా లింగ వివక్షే అన్న వాదన బలంగా ఉన్నది. ఉపాధ్యాయ అనే పిటిషనర్ గతంలో దీనిపై కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. జీవించే హక్కు ఆర్టికల్ 14, సమానత్వ హక్కు ఆర్టికల్ 21లకు ఇది విరుద్దంగా ఉందని పేర్కొన్నారు. ఎంతోమంది యాక్టివిస్టులు,సామాజికవేత్తలు కూడా దీన్ని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్త్రీల ఎదుగుదలకు చిన్న వయసులో వివాహలు అడ్డంకిగా మారుతున్నాయి.
Recommended Video
భారత్లోనే ఎక్కువ చిన్నారి పెళ్లి కూతుళ్లు...
ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 650 మిలియన్ల స్త్రీ జనాభాలో 2030 వరకూ 18ఏళ్ల లోపు ఉన్న 150 మిలియన్ల స్త్రీలకు వివాహం అయిపోతుందని ఒక అంచనా. ఇందులో భారత్ వాటా 30శాతం ఉండనుంది. యునిసెఫ్ ప్రకారం భారత్లో 18 ఏళ్ల లోపు ప్రతీ ఏటా 1.5 మిలియన్ల బాలికలకు వివాహమవుతోంది. అంటే ప్రపంచంలోనే అత్యధిక చిన్నారి పెళ్లి కూతుళ్లను కలిగిన దేశంగా భారత్ ఉంటోంది. ఈ నేపథ్యంలో స్త్రీల కనీస వివాహ వయసును పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.