ఇంకా కుదురుకోలేదు- భవిష్యత్తు చెప్పలేం- ఆర్ధిక వ్యవస్ధపై నిర్మల షాకింగ్ కామెంట్స్-
దేశవ్యాప్తంగా కరోనా తర్వాత పరిస్ధితులు సాధారణ స్ధితికి చేరుకుంటున్నాయని భావిస్తున్నా ఆర్ఠిక వ్యవస్ధ మాత్రం ఇంకా మందగమనంలోనే ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా కరోనా కారణంగా నిలిచిపోయిన వ్యవస్ధలు, కార్యకలాపాలు ఇంకా మునుపటి వేగం అందుకోలేదని అర్ధమవుతోంది. దీంతో మరికొన్నాళ్లు ఆర్ధిక ఇబ్బందులు తప్పవని కేంద్రం సంకేతాలు ఇస్తోంది. తాజాగా ఓ బిజినెస్ పత్రికతో మాట్లాడిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేందుకు కేంద్రం సంస్కరణలు చేపడుతోందని వెల్లడించారు. దీనిపై విమర్శలు వస్తున్నా దీర్ఘకాలంగా వాటి ఆవశ్యకత ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
నత్తనడకన ఆర్ధిక వ్యవస్ధ...
కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన భారత ఆర్దిక వ్యవస్ధ వరుసగా రెండో క్వార్టర్లోనూ కుదురుకోలేదు. ప్రధాన నగరాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆఫీసుల కార్యకలాపాలు మునుపటి స్ధాయికి చేరుకోలేకపోవడం, ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమలు కూడా ఇప్పటికీ సాధారణ స్ధాయిలో ఉత్పత్తి చేయలేకపోవడం వంటి కారణాలతో వరుసగా రెండో క్వార్టర్ కూడా నిరాశాజనకంగానే కనిపిస్తోంది. దీని ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై తీవ్రంగా ఉన్నట్లు తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్ధ అంతంతమాత్రంగానే కోలుకుంటోందని, తిరిగి సాధారణ స్ధాయికి ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదని నిర్మల తన తాజా ఇంటర్వూలో స్పష్టం చేశారు.
కేంద్రం తీరుపై విమర్శలు...
ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలకు సిద్దమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా డిమాండ్, వినియోగదారుల వ్యయాన్ని పునరుద్ధరించడానికి, ప్రభుత్వం కీలక రంగాలకు ఆర్ధిక సాయం చేసేందుకు ఇష్టపడటం లేదని వస్తున్న విమర్శలను నిర్మల తోసిపుచ్చారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్తోనే ఉందని, ఎప్పుడు ఏయే రంగాలకు ఖర్చు చేయాలో తమకు తెలుసుని నిర్మల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్య తీవ్రమైనదని, ఇందులో భాగస్వాములుగా ఉన్న అందరితోనూ చర్చలు జరుపుతున్నట్లు నిర్మల తెలిపారు.
సరైన సమయంలోనే ఆత్మనిర్భర్...
కరోనా సమయంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ ఎవరికీ ఉపయోగపడలేదని విపక్షాలు, ఆర్ధిక వేత్తలు దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో ఆర్ధికమంత్రి మాత్రం దాన్ని మరోసారి వెనకేసుకొచ్చారు. ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నిర్మల తెలిపారు. ప్రస్తుతం
కార్మిక, వ్యవసాయ, బ్యాంకింగ్, డిజిటలైజేషన్, విద్యుత్ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా త్వరలోనే పరిస్ధితులు చక్కబడతాయన్నారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో ప్రభుత్వ రంగ సంస్ధలపై ఇచ్చిన నివేదికపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నిర్మల తెలిపారు. దీని ప్రకారం బ్యాంకులను వ్యూహాత్మక జాబితాలో చేర్చాల్సి ఉంది.
Recommended Video
ఆమ్నెస్టీపై యూపీఏ బాటలోనే...
మానవ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరుకునపెడుతున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధపై వేధింపుల నేపథ్యంలో ఆ సంస్ధ తాజాగా దేశంలో తమ కార్యకలాపాలు నిలిపేసింది. ఆర్ధిక అక్రమాల పేరుతో ఆమ్నెస్టీని కేంద్రం టార్గెట్ చేసిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. వీటిపై స్పందించిన ఆర్ధికమంత్రి యూపీఏ హయాంలోనే ఆమ్నెస్టీ అనుమతులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారని, ఆ తర్వాత కూడా ఆమ్నెస్టీ అక్రమాలకు పాల్పడటం వల్లే తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఏమీ జరగడం లేదని, దేశవ్యాప్తంగా స్కూళ్ల కంటే స్వచ్చంద సంస్దలే ఎక్కువగా ఉన్నాయన్నారు.