ముంబైలో రెడ్ అలర్ట్... కొనసాగుతున్న వర్ష బీభత్సం.. చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని
కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ముంబై నగరం అతలాకుతలం అవుతుంది. ఒకపక్క కరోనా తీవ్రంగా విరుచుకుపడుతున్న తరుణంలో వర్షాలు కూడా ముంబై వాసులను వణికిస్తున్నాయి. నిన్నటి నుండి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం స్తంభించింది.
Recommended Video
ముంబైని ముంచేస్తున్న వర్షాలు: పాత భవనాలు కూలే ప్రమాదం..ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్
ముంబైని ముంచేస్తున్న వర్షం... ఐఎండీ హెచ్చరిక
ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం చిగురుటాకులా వణుకుతోంది. మహారాష్ట్రలోని ముంబై, రాయ్గడ్ మరియు రత్నగిరి తదితర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబై, థానే మరియు రాయ్గడ్ జిల్లాల్లోని అనేక ప్రదేశాలలో రాబోయే 24 గంటల్లో "అత్యంత భారీ వర్షపాతం" ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ముంబై, రాయ్గడ్ మరియు రత్నగిరిలకు రెడ్ అలర్ట్
రానున్న 24 గంటలలో ముంబై, రాయ్గడ్ మరియు రత్నగిరిలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. కొన్ని చోట్ల, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది "అని IMD అధికారి ఒకరు శుక్రవారం అర్థరాత్రి పేర్కొన్నారు .జూలై 4 న, పాల్ఘర్, ముంబై, థానే మరియు రాయ్గడ్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చాలా భారీ వర్షపాతం నమోదవుతుంది అని ఆయన చెప్పారు.
నిన్న ఒక్క రోజే 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు .. లోతట్టు ప్రాంతాలు జలమయం
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఇళ్ళ నుండి బయటకు రావద్దని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని పేర్కొన్నారు . నిన్న కురిసిన వర్షాలకే ముంబైలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి . నిన్న ఏకదాటిగా మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో నిన్న ఉదయం కురిసిన వర్షానికి వర్లినాకా, లాల్బాగ్, దాదర్, మాతుంగా, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
అస్తవ్యస్తంగా జనజీవనం ... అధికారులు అప్రమత్తం
హింద్మాతా, గోల్డ్ ఈవల్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లువిరిగి విద్యుత్ తీగలు తెగిపోయాయి. దాంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. లోకల్ రైళ్ళు రద్దు అయ్యాయి .జన జీవనం అస్తవస్తంగా మారింది. ఇక నేడు సైతం భారీ వర్షాలు ఉన్నాయని తెలపటంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం ప్రస్తుతం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.