తమిళనాడు, ఏపీ మధ్య శేషాచలం ఎన్కౌంటర్ చిచ్చు: ఏపీ కాంగ్రెస్ వంత
చెన్నై/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ పైన తమిళ పార్టీలు భగ్గుమన్నాయి. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైకో ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్ పైన నిష్పక్షపాత దర్యాఫ్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని తమిళనాడు పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఈ ఘటనను తమిళ బీజేపీ చీఫ్ సౌందరరాజన్ కూడా ఖండించారు.
ఎర్ర చందనం కూలీలు, స్మగర్ల మృతి పైన ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన కోణం ఏ కోశాన లేదని చెబుతోంది. ఏపీ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు ఏపీ హోంమంత్రి చినరాజప్పతో ఎన్ కౌంటర్ విషయమై వివరణ ఇచ్చారు.
కాగా, శేషాచల అడవుల్లో గాలిస్తున్న సాయుధ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు మొదట రాళ్ల దాడికి దిగారు. లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా కూలీలు, స్మగ్లర్లు కత్తులు, గొడ్డళ్లను పోలీసులపై విసిరారని సమాచారం. ఈ సంఘటనలో కొందరు పోలీసులు గాయపడటంతోనే పోలీసులు కాల్పులకు దిగారని తెలుస్తోంది. ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన లేదంటున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన స్మగ్లర్ 500 మంది కూలీలను అడవుల్లోకి పంపించారని సమాచారం. ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మరణించగా, చాలామంది అడవుల్లో పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇరవై మంది మృతి: డీజీపీ
ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. స్మగర్లు వస్తున్నారనే సమాచారంతోనే తాము కూంబింగ్ నిర్వహించామన్నారు. కూలీలు, స్మగ్లర్లు దాడి చేశారని, దీంతో పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో ఇరవై మంది మృతి చెందారని చెప్పారు. అందులో ఎవరు స్మగర్లో, ఎవరు కూలీలో తేలాల్సి ఉందన్నారు.
రెండుచోట్ల ఎన్కౌంటర్: చినరాజప్ప
శేషాచలం అడవల్లో రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. పోలీసుల కాల్పుల్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయారని, పరారైన వారికోసం కూంబింగ్ కొనసాగుతోందన్నారు. దీనిపై విచారణ జరిపిస్తాని చిననరాజప్ప చెప్పారు.
ఏపీ కాంగ్రెస్ ఆగ్రహం
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ మానవ హక్కుల ఉల్లంఘన అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. మరణించిన వారంతా కూలీలో అన్నారు. అసలు స్మగర్లను వదిలి అమాయకులను కాల్చి చంపారని మండిపడ్డారు. పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే పొట్టకూటి కోసం వచ్చిన అమయాకుల ప్రాణాలు మిగిలి ఉండేవన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘానికి లేఖ రాస్తామన్నారు.