పార్టీ ఫిరాయిస్తే చర్యలు ఎలా ఉండాలి..పార్లమెంటరీ వ్యవస్థలో సంస్కరణలు అవసరం: అభిషేక్ సింఘ్వీ
ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం భారత్ అని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్, ఎంపీ డాక్టర్ అభిషేక్ సింఘ్వీ. పార్లమెంటరీ డెమాక్రసీ అనే వెబినార్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నో స్తంభాలు ఉన్నాయని అందులో పార్లమెంటు అతి ముఖ్యమైన స్తంభం అని చెప్పారు. బ్రిటీష్ పాలన నుంచి భారత్తో పాటు చాలా దేశాలు విముక్తి పొందాయని చెప్పిన సింఘ్వీ భారత్ మాత్రమే వైబ్రంట్ దేశంగా ఇప్పటికీ నిలుదొక్కుకుందని అది ఎలా సాధ్యమైందంటే దానికి సమాధానం లేదని చెప్పారు.
విప్ జారీ చేస్తే మంచి ఆలోచనలు అనగదొక్కినట్లే
ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం కనిపించదని అయితే భారత్లో మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు అభిషేక్ సింఘ్వీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరం పరిరక్షించుకోవాలని చెప్పారు. పార్లమెంటు అంటే చట్టాలు చేసే గొప్ప వేదిక అని చెప్పిన సింఘ్వీ... ఇదొ క ప్రజల దేవాలయం అని చెప్పారు. ఇక పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవశ్యకత ఉందని చెప్పారు. ప్రైవేట్ బిల్లులు పై ఎంపీలు శుక్రవారం మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని అయితే అది చట్టంగా మాత్రం చేయరని చెప్పారు. ఒక వ్యక్తి మంచి ఆలోచనతో వచ్చి ఒక విషయంపై చట్టం చేయాలంటే అది కేవలం ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు మాత్రమే పరిమితం అవుతుందని అని చెప్పిన సింఘ్వీ... చట్టం చేసేందుకు ఎంపీలకు కూడా అధికారం ఇవ్వాలని చెప్పారు. ఒక విషయంపై పార్టీ విప్ జారీ చేయడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల ఎంపీలకు ఉన్న మంచి ఆలోచనలను అణిచివేస్తుందని చెప్పారు. ఇందులో మార్పులు రావాలని సంస్కరణలు రావాలని కోరారు. మనీ బిల్, విశ్వాస పరీక్ష లేదా అవిశ్వాస పరీక్ష వరకు విప్లు పరిమితం కావాలని కోరిన సింఘ్వీ చట్టాలు చేసే సమయంలో పరిమితి విధించడం సరికాదన్నారు.
పార్టీ ఫిరాయింపులు చేస్తే ఏం చేయాలి..?
ఆయారాం.. గాయారాం అనే నానుడి అందరు వినే ఉంటారని చెప్పిన సింఘ్వీ ఇది 1967లో పుట్టుకొచ్చిందని చెప్పారు గయారాం అనే వ్యక్తి ఒకేరోజు మూడు పార్టీలు మారారని చెప్పారు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం అనే అంశంపై కూడా సంస్కరణలు రావాలని కోరారు. ఒక వేళ ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారితే అది మరొకరు స్పీకర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఏళ్ల తరబడి స్పీకర్ పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. ఒక వ్యక్తి పార్టీ మారకుండా రాజీనామా చేసి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తారని చెప్పిన సింఘ్వీ.. ఇదొక మాయ అని చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు తర్వాత మంత్రులుగా దర్శనమిస్తారని చెప్పారు. గవర్నర్ అనే వ్యక్తి నామినల్గా మాత్రమే ఉంటారని రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పారు సింఘ్వీ. కేబినెట్ చెప్పినట్లుగా గవర్నర్ వ్యవహరించాల్సిన పనిలేదని ఆయన విచక్షణాధికారం మేరకు మాత్రమే వ్యవహరించే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఇందుకు రాజస్థాన్ రాజకీయ ముఖచిత్రాన్ని ఉదహరించారు అభిషేక్ సింఘ్వీ. అన్నీ కోర్టుల వరకు రాకూడదని చెప్పిన సింఘ్వీ రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. స్పీకర్ ఒక వేళ అనర్హత వేటు వేస్తే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం సరికాదన్నారు.
మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా సవరణలు
ఒక వేళ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టివేసినట్లయితే ఆ ప్రజాప్రతినిధి మరో ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు మళ్లీ చట్టసభల్లోకి అడుగు పెట్టకుండా ఉండేలా సవరణ చేయాలని చెప్పారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో ఇదొక చిన్న మార్పు చేయాలని ఆయన తన అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్లో స్పీకర్ ఎన్నిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నికలకు రెండువారాల ముందే స్పీకర్ను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. పార్లమెంటరీ డెమాక్రసీలో పార్టీ ఫిరాయింపు అనేది అత్యంత ప్రమాదకరమైనదని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు తప్పు అని చెబుతున్నప్పుడు వారికి మళ్లీ పదవులు ఇవ్వడం తప్పు అవుతుందని చెప్పారు.
Recommended Video
మనీ బిల్ విషయంలో మరోసారి ఆలోచించాలి
పార్లమెంటు మొత్తం ఏడాదిలో నాలుగునర్ర నెలలు సమావేశం అవుతుందని చెప్పిన అభిషేక్ సింఘ్వీ... అసెంబ్లీ సమావేశాలు కేవలం ఏడాదిలో 30 రోజులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. ఇది మారాలని అన్నారు. ఇక పార్లమెంటులో వెల్లోకి దూసుకొచ్చిన సభ్యుల వేతనాల్లో ఆరోజు వేతనంలో కోత విధించాలని చెప్పారు. అలాంటి సభ్యులను మార్షల్ చేత బయటకు పంపించి సస్పెండ్ చేయాలని చెప్పారు. ఇలాంటి తప్పు మళ్లీ చేస్తే అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో డిప్యూటీ ఛైర్మెన్ లేదా స్పీకర్గా చేయకుండా చూడాలని చెప్పారు. ఇక ఆర్డినెన్స్ పై కూడా మాట్లాడిన సింఘ్వీ... బిల్లులు లోక్సభలో పాసై రాజ్యసభకు వెళతాయని ఒకవేళ రాజ్యసభలో పాస్ కాకుంటే తిరిగి లోక్సభ పాస్ చేస్తుందని చెప్పారు. అయితే మనీ బిల్ విషయంలో కచ్చితంగా లోక్సభతో పాటు రాజ్యసభ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని చెప్పారు. ముందుగా సాధారణ బిల్లుకు మనీ బిల్లుకు తేడా ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రభుత్వానికి సంఖ్యా బలం ఉన్నందున బిల్లులపై వ్యతిరేకం వ్యక్తమైనా అది పాస్ అవుతుందని అలాంటి వ్యవస్థ ఉండకూడదని సింఘ్వీ అభిప్రాయపడ్డారు.
పార్లమెంటరీ డెమాక్రసీలో కొన్ని మంచి అంశాలున్నాయని చెప్పారు. సంస్కరణలు తీసుకువచ్చే అధికారం ఉందని చెప్పారు. అయితే స్ట్రక్చర్ను మార్చకుండా సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. ఈ రోజు దేశంలో ప్రెసిడెంట్ వ్యవస్థకు పార్లమెంట్ వ్యవస్థకు పెద్ద తేడా కనిపించడం లేదని వెల్లడించారు. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కచ్చితంగా సమూలమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే రాజ్యాంగ వ్యవస్థ స్ట్రక్చర్ను మార్చరాదని చెప్పారు.