బాధ్యతా రహిత వ్యాఖ్యలొద్దు, అంగీకరించను: మోడీ
న్యూఢిల్లీ: బాధ్యతా రహిత, వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని తమ పార్టీ నేతలకు, అనుబంధ సంస్థల నాయకులకు సూచించారు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. మంగళవారం ఆయన ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇటీవల విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా, బిజెపి నేతలు అమిత్ షా, గిరిరాజ్ సింగ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మోడీ పై విధమైన సందేశాలను పంపినట్లు తెలుస్తోంది.
బిజెపి మంచి కోరుకునే నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, అభివృద్ధి, సుపరిపాలన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ కోరారు. బాధ్యతా రహిత వ్యాఖ్యలు తనకు ఆమోదం కాదని, అలాంటి వ్యాఖ్యలను దయచేసి చేయకూడదని ఆయన సూచించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ బిజెపి అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఖండించారు.
ఎన్నికల ర్యాలీలో గిరిరాజ్ మాట్లాడుతూ.. మోడీని వ్యతిరేకించిన వారు పాకిస్థాన్ వెళ్లాలని ప్రకటించారు. అలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్యలను నిరాకరిస్తున్నట్లు మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం బిజెపి అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజలందరిని సమానంగా చూడటమే బిజెపి లక్ష్యమని తెలిపారు. దయచేసి అలాంటి ప్రకటనలు మరోసారి చేయవద్దని పార్టీ నాయకులను మోడీ కోరారు.
అదే విధంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలను మోడీ ఖండించారు. తొగాడియా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భావనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తొగాడియా మాట్లాడుతూ.. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు భూములు కొనుగోలు చేయడాన్ని ఆపాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీలు మండిపడ్డాయి. కాగా, తొగాడియా చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేపును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. అంతేగాక తొగాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు సమాచారం.