దళితులు అనే పదం వాడొద్దు: ప్రైవేటు చానళ్లకు ఆదేశాలు, పలువురి ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రయివేటు టీవీ చానళ్లు ఇక నుంచి 'దళిత్' అనే పదం ఉపయోగించవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దళిత్కు బదులు ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్) ఉపయోగించాలని సూచించింది.
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలను ఇచ్చింది. షెడ్యూల్ కులాల ప్రజలను దళితులు అని పిలువవద్దని, ఆ పదం ఉపయోగించడాన్ని ఆపాలని మీడియాకు సూచించాలని ఈ ఏడాది జూన్ నెలలో బాంబే హైకోర్టు.. సమాచార మంత్రిత్వ శాఖను అడిగింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఇటీవల మీడియాకు మార్గదర్శకాలు పంపింది.
దళితులు అనే పదాన్ని వ్యతిరేకిస్తూ పంకజ్ మేశ్రమ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పదం వాడవద్దని చెప్పింది. అలాగే ఆ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దళిత్ అనే పదానికి బదులు ఆంగ్లంలో షెడ్యూల్ క్యాస్ట్, స్థానిక భాషల్లో ఆ పదానికి అనువాదం ఉపయోగించాలని చెప్పింది.
దళిత్ అనే పదం వాడవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంపై కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పదం రాజకీయ ప్రాధాన్యతతో పాటు గుర్తింపుతో కూడుకున్నదని వారు చెబుతున్నారు.