మోడీ ప్లేన్ గంటన్నర లేట్, విదేశాల్లో స్పందనపై సల్మాన్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మయన్మార్ పర్యటన ముగించుకొని బ్రిస్బేన్ వెళ్తుండగా ఆన విమానం ఎయిర్ ఇండియా వన్లో ఇంధనం నింపవలసి వచ్చింది. మయన్మార్లోని నైపిటా విమానాశ్రయంలో అందుకు కావలసిన పరికరాల కోసం ఎయిరిండియా సిబ్బంది అడగగా.. అక్కడి వారు నిరాకరించడమే కాకుండా అరెస్టు చేస్తామని బెదిరించారట.
మయన్మార్లోని ఎంబసీ, భారత్ నుండి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు కలుగజేసుకొని ఫోన్ల మీద చర్చలు జరిపితే కానీ విమానంలో ఇంధనం నింపడం సాధ్యం కాలేదు.
దాంతో విమానం షెడ్యూల్డ్ సమయం కన్నా 92 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది. గత గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. విమానంలో ఇంధనం నింపడం ఆలస్యానికి అక్కడి వారు పలు రకాల కారణాలు చెప్పారు.
మోడీకి వస్తున్న స్పందనపై సల్మాన్ ఖుర్షీద్
విదేశాల్లో నరేంద్ర మోడీ సభలకు వస్తున్న స్పందన అంతా ఉత్తుత్తిదేనని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. సభలకు వస్తున్న వారిని బీజేపీ యంత్రాంగం సమీకరిస్తోందన్నారు. తను మయన్మార్లోని నైపిటాలో రెండుసార్లు పర్యటించానని, అక్కడి వీధుల్లో ఎవరూ కనిపించరని అంటూ, మోడీ కోసం ఒక్కసారిగా 20 వేలమంది ఎక్కడినుంచి వచ్చారని ప్రశ్నించారు.
ఈ స్పందన అంతా ఉత్తిదే అన్నారు. మోడీ తన వెంట తమ వారిని తీసుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. నన్ను నమ్మకుంటే ఫ్లైట్ టిక్కెట్లు చెక్ చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారట. కాగా, ఖుర్షీద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. అదంతా కాంగ్రెస్ దివాలాకోరుతనమన్నారు.