దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేత: టీఆర్ లు కూడా లేవు: కారణం తెలుసా?
Recommended Video
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. గురువారం నుంచి ఏ ఒక్క వాహన రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవస్థను వాహన్ డేటాబేస్ తో సమీకృతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దేశంలో దాదాపు అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో పడిపోయాయి. దీనితో వాహన డీలర్లు, కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించారు. దాన్ని వాహన్ డేటాబేస్ తో అనుసంధానించారు. ఈ డేటాబేస్ మొత్తం కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేస్తుంటుంది. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవస్థను ఈ డేటాబేస్ తో సమీకృతం చేయలేదు. సాధారణ నంబర్ ప్లేట్లతోనే ప్రస్తుతం కాలం గడుపుతున్నారు అధికారులు.
ముందే సూచించినా..
నిజానికి- హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవస్థను వాహన్ డేటాబేస్ తో సమీకృతం చేయడానికి ఈ నెల 4వ తేదీన ఉపరితల రవాణ మంత్రిత్వశాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని విధి విధానాలను వారు రూపొందించారు. వాటిని అదే నెల 18వ తేదీన అన్ని రాష్ట్రాల రవాణా మంత్రిత్వశాఖ కార్యాలయాలకు పంపించారు. అయినప్పటికీ- వారు దాన్ని సమీకృతం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వాహనాలను విక్రయించే డీలర్లు, షోరూంల యజమానులు దీనిపై ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. వారిలో మార్పు తీసుకుని రావడానికి ఆర్టీఏ అధికారులు కూడా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ ఇబ్బంది లేదు. దీనికి కారణం- ఈ మూడు రాష్ట్రాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వాలు వాహన్ డేటాబేస్ మీద ఆధారపడి లేవు. సొంతంగా వాహన రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను రూపొందించుకున్నాయి. ఫలితంగా- రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ లో యథాతథంగా వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని చోట్లా రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి.
లక్షలాది సంఖ్యలో దరఖాస్తులు
వాహన్ డేటాబేస్ తో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వ్యవస్థను సమీకృతం చేయకపోవడం వల్ల ఏపీ, తెలంగాల, మధ్యప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన వాహన డీలర్లు నిరాశతో వెనక్కి మళ్లుతున్నారు. అసలు కారణం తెలియక, అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నారు. ఏ అధికారిని అడిగినా.. వారు సరైన కారణాలు చెప్పట్లేదు. సర్వర్ డౌన్ అయిందంటూ సమాధానాలను ఇస్తున్నారు.
2012లోనే తప్పనిసరి చేసినా..
2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నాణ్యత, వాహన కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడం, ఇతరత్రా కారణాలతో అన్ని వాహనాలను హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చడం సాధ్యం కాలేదు. దీనితో కొన్ని మార్పులు చేశారు. వాహనం అమ్మకం జరిగే షోరూం నుంచే.. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చే విధంగా నిబంధనలను సరీళీకరించారు. 2019, ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లో రిజిస్ట్రేషన్ అయ్యే బైకులు, కార్లు, ఇతర నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి, డెలివరీ చేసేలా నిబంధనలను తీసుకొచ్చారు. ఒక్కో నంబర్ ప్లేట్లకు బైక్కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి.