తమ్ముడి ఆస్తులు అన్నకు, ఆర్కాం ఆస్తులు జియో చేతికి: అనిల్ ఆస్తులు వేరేవాళ్లకు వెళ్లకుండా
ముంబై: అనిల్ అంబానికి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్ వైర్ లెస్ అసెట్స్ను రిలయెన్స్ జియోకు అమ్ముతున్నారు. ఈ మేరకు గురువారం ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
దీని ఆస్తులను కొనుగోలు చేసేందుకు రిలయెన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. తన తమ్ముడి ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా ముఖేష్ అంబానీనే ఆర్ కామ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు.
నాలుగు కెటగిరీల్లోని ఆస్తులు
రిలయెన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)కు చెందిన నాలుగు కేటగిరీల్లోని.. వైర్ లెస్ స్పెక్ట్రమ్ అండ్ మీడియా, టవర్స్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్, కన్వర్జెన్స్ నోడ్స్లను రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చేతికి వెళ్లనున్నాయి. ఆర్ కాంకు చెందిన 4జీ స్పెక్ట్రం, 43వేల టవర్స్ ఇక జియో కింద ఉంటాయి.
జనవరి నుంచి మార్చి మధ్యలో
వీటికి సంబంధించి లావాదేవీలు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకే రిలయెన్స్ కమ్యూనికేషన్స్కు దాదాపు రూ.45వేల కోట్ల అప్పులు ఉన్నాయి.
ముందుకొచ్చిన ముఖేష్ సంస్థ, అత్యధిక బిడ్
వీటిని తగ్గించుకొనేందుకు కొత్త పునరుజ్జీవ పథకం పేరుతో అది ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా వీటిని కొనుగోలు చేసేందుకు ముఖేష్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం జియో అత్యధిక బిడ్ దాఖలు చేసింది. పునరుజ్జీవ పథకం ద్వారా ఆర్ కామ్ తన రుణభారాన్ని రూ.6వేల కోట్లకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది.
ముఖేష్ కొనుగోలు.. దూసుకెళ్లిన షేర్లు
రిలయెన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను ముఖేష్ అంబాని కొనుగోలు చేయనున్నారని ముందు నుంచి వార్తలు వచ్చాయి. దీంతో ఆ షేర్లు బాగా పెరిగాయి. గత వారం పది రోజుల్లో ఆర్ కామ్ షేర్ విలువ 110 శాతం పెరిగింది.