ఆస్తులు అమ్మి డబ్బులు కట్టాలి..ఆ టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోరాదు: జియో
ముంబై: జియోకు పోటీనిస్తున్న పలు టెలికాం ఆపరేటర్లు నష్టాల బాటలో ఉన్న సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవడాన్ని ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో తప్పుపట్టింది. ప్రభుత్వం నష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లను ఆదుకోరాదని చెప్పింది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు ఏడు బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో వాటికి ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వరాదని జియో సంస్థ పేర్కొంది. అదే క్రమంలో డ్యూస్ ఎలా చెల్లించాలో కూడా సలహా చెప్పింది జియో సంస్థ.
జియో జంఝాటం: బేసిక్ ప్లాన్తో పాటు ఈ టాప్అప్ తప్పనిసరి
ఆస్తులు అమ్మి డబ్బులు చెల్లించాలి
నష్టాల్లో ఉన్న భారతీ ఎయిర్టెల్ రూ.40వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎయిర్టెల్ సంస్థ కొన్ని కంపెనీ ఆస్తులను అమ్మడం, షేర్లను విక్రయించడంద్వారా డబ్బులను సమకూర్చుకోవచ్చిన జియో సంస్థ చెప్పింది. అదే సమయంలో మరో ప్రైవేట్ నెట్వర్క్ వొడాఫోన్ కూడా ఆస్తులను అమ్మి డబ్బులు చెల్లించాలని నవంబర్ 1వ తేదీని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీం కోర్టు గత నెలలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను రూ.49000 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఎయిర్టెల్ టవర్లను అమ్మాలి: జియో
భారతీ ఎయిర్టెల్ తన ఇండస్ టవర్ వ్యాపారంలోని ఆస్తులను 15శాతం నుంచి 20శాతం మేరా విక్రయిస్తే డబ్బులు చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు రిలయన్స్ జియో ఉన్నతాధికారి కపూర్ సింగ్ గులియానీ. అదే సమయంలో ఇండస్ టవర్ బిజినెస్లో వొడాఫోన్ కూడా వాటాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఆ షేర్స్ను విక్రయిస్తే అవసరం మేరా డబ్బులు వస్తాయని ఆ డబ్బులను డ్యూస్ కింద చెల్లించొచ్చని సలహా ఇచ్చారు.
ప్రభుత్వం చేయూతనివ్వరాదు: జియో
ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 1,63,000 టెలిఫోన్ టవర్లను నిర్వహిస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఆపన్న హస్తం అందివ్వాలని ఆలోచిస్తోందని కేంద్ర టెలికాంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పిన నేపథ్యంలో రిలయన్స్ జియో ప్రభుత్వానికి ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీ ఎయిర్టెల్ తొలిసారిగా నష్టాల్లోకి జారుకోగా.. కుమారమంగళం బిర్లా సంస్థ వొడాఫోన్ ఐడియా వరుసగా 11 త్రైమాసికాల నుంచి నష్టాల బాటలో పయనిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఇష్టానుసారంగా వ్యవహరించరాదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రిలయన్స్ జియో సంస్థ తన ప్రకటనలో పొందుపర్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని టెలికాం ఆపరేటర్లు అవసరమైన డబ్బును మూడునెలల సమయంలో డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రిలయన్స్ జియో సంస్థ తన ప్రకటనలో నొక్కి ఒక్కానించింది.