ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన రిలయన్స్ జియో
రిలయన్స్ జియో, పేటీఎంలు శుక్రవారం నాడు క్షమాపణ చెప్పాయి. తమ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు అవి ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, పేటీఎంలు శుక్రవారం నాడు క్షమాపణ చెప్పాయి. తమ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు అవి ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి.
ప్రధాని ఫొటోలు ప్రకటనలపై వినియోగించడంపై ఈ రెండు కంపెనీలకు గతంలో ప్రభుత్వం నోటీసులు పంపించింది. నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా జరిమానా కట్టాల్సి ఉంటుందని జియో, పేటీఎంలను హెచ్చరిస్తూ నోటీసులు పంపించింది. దీంతో ఈ రెండు సంస్థలు ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి.
గత ఏడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన జియో నెట్ వర్క్ ప్రకటనలపై మోడీ ఫొటో వేశారు. ఈ 4జీ సేవల నెట్ వర్క్ను ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్కు అంకితం చేస్తున్నామని జియో మోడీ ఫొటోతో పాటు ప్రకటన ప్రచురించింది.
గత నవంబరులో పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం కూడా ఇదే తరహాలో ప్రకటనల్లో మోడీ ఫొటోను ఉపయోగించింది. నిబంధనల ప్రకారం వాణిజ్య ప్రకటనలకు ప్రధాని పేరు, ఫొటో ఉపయోగించకూడదు.