ఈనెలతో ముగియనున్న జియో ప్రైమ్ మెంబర్షిప్.. మరి తర్వాతేంటి?
న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఒక సంచలనం. ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఆరంభం నుంచీ తన వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తూ వచ్చింది జియో. అందులో భాగంగానే గత ఏడాది జియో ప్రైమ్ మెంబర్షిప్ను రూ.99కి ప్రారంభించింది.
ఈ ప్రైమ్ మెంబర్షిప్ను పొందిన వారికి మొబైల్ డేటాతోపాటు రూ.10 వేల విలువైన జియో యాప్స్ను కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద ఏడాదిపాటు తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అయితే మార్చి నెలాఖరుతో జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు ముగుస్తోంది.
మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు జియో వినియోగదారుల ముందున్న ప్రశ్న. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ప్రైమ్ మెంబర్ షిప్ గడువును రూ.99కే మళ్లీ మరో ఏడాదిపాటు పైన చెప్పిన బెనిఫిట్స్తోపాటుగా రిలయన్స్ జియో పొడిగించనుంది.
అయితే కొంతమందేమో జియో అలా చేయకపోవచ్చని, ప్రైమ్ మెంబర్షిప్ రుసుమును కొంత పెంచి బెనిఫిట్స్ను మాత్రం అలాగే అందిస్తుందేమో అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఇకమీదట ప్రైమ్ మెంబర్షిప్ అంటూ ఏమీ ఉండదని, అలాగే ఏప్రిల్ నుంచి జియో యాప్స్ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. ఇటు ప్రైమ్ మెంబర్షిప్ గురించిగాని, కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద ఇన్నాళ్లూ ఉచితంగా అందించిన యాప్స్ గురించి గాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే దీనిపై త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.