తీపి కబురు: జియో ప్రైమ్ గడువు పెంచిన రిలయన్స్
ముంబై: టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు మరోసారి తీపి కబురును అందించింది. రూ.99కి గత సంవత్సరం ప్రైమ్ మెంబర్ షిప్ పొందిన కస్టమర్లకు ఆ సభ్యత్వ గడువు రేపటితో ముగియనుంది.
కాగా, రూ.99 చెల్లించి ఇప్పటికే ప్రైమ్ మెంబర్లుగా ఉన్నవారు మరో ఏడాది పాటు ఎలాంటి రుసుం లేకుండానే ఉచితంగా ప్రైమ్ సేవలను పొందవచ్చని జియో ప్రకటించింది. శుక్రవారం జియో ఈ ప్రకటన చేసింది.
అయితే అందుకు గాను రేపు జియో యాప్లో అందుబాటులోకి రానున్న ఓ ఆప్షన్ను క్లిక్ చేసి అందులో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగించేందుకు సంసిద్ధతను తెలుపుతూ కస్టమర్లు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి మార్చి 31, 2019 వరకు ఏడాది పాటు ఎలాంటి రుసుం చెల్లించకుండానే జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా లభిస్తుంది.
ఇక కొత్తగా జియోలో చేరే కస్టమర్లు మాత్రం ఎప్పటిలా రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ను పొందాల్సి ఉంటుంది. దీంతో వారికి కూడా ప్రైమ్ మెంబర్షిప్ సేవలు మార్చి 31, 2019 వరకు లభిస్తాయి.