జియో రాకతో వినియోగదారులకు రూ.64వేల కోట్ల ఆదా, పెరిగిన తలసరి జీడీపీ
న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ నెలలో రిలయెన్స్ జియో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది వినియోగదారులకు $10 బిలియన్లను సేవ్ చేసింది. ఈ మేరకు హార్వార్డ్ బిజినెస్ స్కూల్ అనుబంధ ఐఎఫ్సీ (ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటెటివ్నెస్) నివేదిక దీనిని వెల్లడించింది.
అంతేకాదు, దీంతో పాటు తలసరి జీడీపీ కూడా పెరిగిందని పేర్కొంది. జియో మార్కెట్లోకి వచ్చిన తొలి నాళ్లలో ఉచిత డేటా అందించింది. ఆ తర్వాత తక్కువ టారిఫ్లతో అనేక డేటా ఆఫర్లను తీసుకొచ్చింది.
జియోకు ముందు 1జీబీ డేటాకు సగటున రూ. 152 ఉండగా, ఆ తర్వాత అది రూ.10కి పడిపోయింది. దీని వల్ల కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం చేరింది. తద్వారా వినియోగదారుల డేటా ఖర్చులు కూడా బాగా తగ్గాయి.
జియో రాక తర్వాత వినియోగదారులకు ఏటా 10 బిలియన్ డాలర్లు ఆదా అవుతున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.64వేల కోట్లు. దీని వల్ల జీడీపీ 5.65% పెరిగిందట.
జియో తర్వాత భారత టెలికం మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయని, జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పించి జియో ఇతర టెలికాం సంస్థలకు పోటీగా నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది.
జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా యూజర్లు గల దేశంగా ఎదిగింది. జియోకు పోటీగా ఇప్పటికే అనేక టెలికం సంస్థలు తమ టారిఫ్లు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులకు డేటా ఖర్చుల నుంచి ఊరట కలిగింది.