వామ్మో.. మరో షాక్, జియో టారిఫ్ మరింత ప్రియం... మరికొద్ది వారాల్లో ప్రకటన...
4జీ సేవలతో దేశంలో సంచలనం సృష్టించిన జియో ఇప్పటికే తన రెంటల్ ప్లాన్ కాస్త ఛేంజ్ చేసింది. ఇప్పటివరకు కనీస రెంటల్లో జియోతోపాటు ఇతరులకు కూడా ఫ్రీ కాల్ సదుపాయం కల్పించింది. కానీ దానిని గత నెలలో మార్చి ఇతర నెట్వర్క్ మొబైళ్లకు టారిఫ్ వేసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఆ నిర్ణయంతోనే ఊసురుమన్న వినియోగదారులకు మరో పిడుగులాంటి వార్తను తెలియజేసింది.
మరికొద్ది రోజుల్లో మొబైల్ టారిఫ్ పెంచుతామని జియో సంకేతాలు ఇచ్చింది. తన ప్రత్యర్థులు ఎయిర్ టెల్, వోడాఫోన్ డిసెంబర్ 1 నుంచి టారిప్ పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో.. తాము కూడా అంటూ జియో కూడా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందిస్తామని తెలిపింది. తమ టారిఫ్కు సంబంధించి ట్రాయ్కు తెలియజేసి నిర్ణయం వెలువరిస్తామని పేర్కొన్నది.
ఇతర నెట్ వర్క్లు టారిఫ్ సవరిస్తున్నందున మాత్రం పెంచడం లేదని పేర్కొంది. మరోవైపు వొడాఫోన్, ఎయిర్ టెల్ డిసెంబర్ నుంచి మొబైల్ చార్జీలను 35 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లకు మంగళవారం మంచి డిమాండ్ వచ్చింది.