రిలయన్స్ జియోతో ఎస్బీఐ ఒప్పందం: వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు
ముంబై: రిలయన్స్ జియో, ఎస్బీఐల మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో రెండు సంస్థల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. డిజిటల్ చెల్లింపుల సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేసేందుకు రిలయన్స్ జియో-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియో పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఎస్బీఐ డిజిటల్ కస్టమర్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జియోలో యోనో కూడా..
ఆర్ఐఎల్-ఎస్బీఐ 70:30 భాగస్వామ్యంతో పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ అందించే ‘యోనో' ఫ్లాట్ ఫాం వేదికగా జియో మొబైల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా వెల్లడించింది. మై జియో యాప్ లో ఎస్బీఐ ‘యోనో'ను జోడించనున్నారు.
ఎస్బీఐ వినియోగదారులకూ జియో ప్రైమ్ ప్రయోజనాలు
దేశంలో అతిపెద్ద ఓవర్ ది టాప్(ఓటీటీ) మొబైల్ అప్లికేషన్స్లో ‘మై జియో' యాప్ ఒకటిగా ఉంది. ఇప్పుడు జియో-ఎస్బీఐ భాగస్వామ్యంతో ఆర్థిక సేవలను కూడా అందించనుంది. దీని ద్వారా అటు ఎస్బీఐ, ఇటు జియో వినియోగదారులిద్దరూ రిలయన్స్ జియో ప్రైమ్ ప్రయోజనాన్ని పొందనున్నారు.
ప్రత్యేక ధరలకే జియో ఫోన్లు..
ఇప్పటికే ఎస్బీఐ వినియోగదారులకు రివార్డు పాయింట్లు అందిస్తుండగా, ఇప్పుడు జియో భాగస్వామ్యంతో మరిన్ని రివార్డు పాయింట్లు వినియోగదారుల ఖాతాలో జమకానున్నాయి. అంతేగాక, ఎస్బీఐ ఖాతాదారులకు జియో ఫోన్లు ప్రత్యేక ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.
ఇరుపక్షాల వినియోగదారులకు లాభమే
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. అతిపెద్ద నెట్వర్క్ అయిన జియోతో చేతులు కలపడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజా ఒప్పందం ద్వారా ఎస్బీఐ, జియో వినియోగదారులు మరింత లబ్ధి పొందే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ తెలిపారు. కాగా, 60-90రోజుల్లో ఈ ఉమ్మడి సేవలు అందుబాటులోకి రానున్నాయి.