5జీ సేవల కోసం జియో సన్నాహాలు.. శాంసంగ్ తో ఒప్పందం
జియో.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా 5జీ సేవలు అందించేందుకు.. మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తో జత కట్టింది.
ముంబై: ఆరంగేట్రంతోనే సంచలనం సృష్టించి.. ఇతర టెలికాం నెట్ వర్క్ లను కోలుకోలేని దెబ్బ తీసిన రిలయన్స్ జియో.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉచిత డేటా, కాలింగ్ తదితర ఆఫర్లతో రికార్డ్ స్థాయిలో వినియోగదారులను సొంత చేసుకుంది జియో.
తాజాగా మరోమారు తన పోటీ కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో పావులు కదుపుతోంది. దేశంలో తొలిసారిగా 5జీ సేవలు అందించేందుకు.. మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తో జత కట్టింది.
స్పెయిన్ లోని బార్సిలోనా లో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 సమావేశాల్లో ఈ మేరకు శాంసంగ్, జియో ఒక ఒప్పదం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంసంగ్.. 5జీ సేవల హోమ్ రౌటర్, రేడియో బేస్ స్టేషన్, 5జీ మోడెం చిప్ సెట్ లను ఈ సమావేశాల్లో ఆవిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత వారం వెల్లడించిన 'ప్రైమ్ మెంబర్ షిప్' పథకం ప్రకారం.. కొత్త వినియోగదారులకు త్వరలో 5జీ సేవలను అందించేందుకు జియో సమాయత్తమవుతోంది. ముఖ్యంగా 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' త్వరలో ముగియనుండడంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ లను అమలు చేయనుంది.
తన ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్ల కు అపరిమితి ప్రయోజనాలు 2018 మార్చి 31 వరకు అందించేలా కొత్త ప్లాన్స్ అందించనుంది. ఈ క్రమంలో జియో టీవీ, జియో మ్యూజిక్, జియో మ్యాగ్స్, జియో సినిమా, జియో ఎక్స్ ప్రెస్ లాంటి మీడియా సేవలు కూడా అందించనుంది.
అంతేకాదు, జియో త్వరలోనే 5జీ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్ లోకి తీసుకురానుంది. మరోవైపు నోకియా ఇప్పటికే 5జీ సేవలపై దృష్టి సారించి బీఎస్ఎన్ఎల్ తో జట్టుకట్టగా.. ఇప్పుడు జియో తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది.