రిలయన్స్ ఆఫర్: ఉద్యోగులు, పిల్లలు, పేరంట్స్కు కూడా.. నీతా అంబానీ ప్రకటన
కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దవాఖానల్లో కూడా టీకా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలియజేసింది. వారి పిల్లలు, వారి పేరంట్స్కు వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడించింది.
తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి పిల్లలు, తల్లిదండ్రులకు రిలయన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు, వారి కుటుంబీకులకు టీకాను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. ఇందుకోసం పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె ఈ-మెయిల్ పంపించారు.
ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకెంతో ముఖ్యం అని నీతా అంబానీ అన్నారు. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని అన్నారు. గత సంవత్సరం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో అందరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారికంగా నీతా అంబానీ మెయిల్ చేశారు. తమ బాగుకోరి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.