అంబానీ మరో సంచలన ప్రకటన: సెప్టెంబర్ 5న గిగాఫైబర్ సేవలు...ధరలు ఇలా ఉన్నాయి
ముంబై: 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ ప్రసంగించారు. గతేడాది అత్యధిక లాభాలను ఆర్జించి తమ సంస్థ రికార్డు సృష్టించిందని అంబానీ చెప్పారు. రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసినట్లు అంబానీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక భాగస్వామ్యం పోషించిందని చెప్పిన అంబానీ... రిలయన్స్ జియో 340 మిలియన్ వినియోగదారులను దాటిందని చెప్పారు.
డిజిటల్ రంగంలో కొత్త పుంతలు తొక్కనున్న జియో
పెట్రో కెమికల్స్లో రిలయన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 20శాతం వాటా కలిగి ఉందని ముఖేష్ అంబానీ చెప్పారు. పెట్రో కెమికల్స్లో సౌదీ అరాంకోతో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. జియో ఏర్పాటు చేసి ఈ సెప్టెంబర్కు మూడేళ్లు పూర్తవుతుందని చెప్పారు. జియో దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవం తీసుకొచ్చిందని చెప్పారు. యావత్ భారత్ దేశం తమపై ఉంచిన నమ్మకంతోనే ఇదంతా సాధ్యమైందని ముఖేష్ ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ రంగంలో రిలయన్స్ ఒక విప్లపం తీసుకొచ్చిందని చెప్పిన అంబానీ ... ఈ రంగంలో మరింత అభివృద్ధి చోటుచేసుకుంటుందని చెప్పారు.
బ్రాడ్ బ్యాండ్ రంగంలో విప్లవం తీసుకొస్తున్నాం
బ్రాడ్ బ్యాండ్ రంగంలో ఈ ఆర్థిక ఏడాదిలోనే విప్లపం తీసుకొస్తామని అంబానీ చెప్పారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ముఖేష్ అంబానీ చెప్పారు. రిలయన్స్ జియోను 5జీగా త్వరలోనే అప్గ్రేడ్ చేస్తామని చెప్పిన ఆయన... ప్రతి నెలా 10మిలియన్ మంది కొత్త కనెక్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే జియో బ్రాడ్బ్యాండ్ను తీసుకొస్తామని చెప్పారు. జియో ఫైబర్తో ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు ల్యాండ్ లైన్ కనెక్షన్, డిజిటల్ సెటాప్ బాక్స్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఒక్క కనెక్షన్తోనే ఇవన్నీ పొందొచ్చని చెప్పారు. లోకల్ కేబుల్ ఆపరేటర్స్ను భాగస్వామ్యులుగా చేర్చుకున్నట్లు చెప్పారు అంబానీ. త్వరలో 1600 పట్టణాల్లో 20 మిలియన్ మందికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
జియో గిగా ఫైబర్ ధరలు ఇలా ఉంటాయి
సెప్టెంబర్ 5 నాటికి జియో మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో అదే రోజున జియో గిగా ఫైబర్ను లాంచ్ చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ చెప్పారు. ఇప్పటికే 5 లక్షల గృహాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించామని చెప్పారు. వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మరింత క్వాలిటీతో ముందుకు వస్తున్నామని ముఖేష్ అంబానీ తెలిపారు.ఇక జియో ఫైబర్ ప్లాన్లు రూ. 700 నుంచి ప్రారంభమై రూ.10వేల వరకు ఉంటాయని చెప్పారు. ఇక జియో కనెక్షన్తో ఇతర ఆపరేటర్లకు సైతం ఉచితంగా ఫోన్కాల్స్ చేసుకోవచ్చిన చెప్పారు. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసుకోవాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేదాని ఇకపై ఆ ధరలు ఉండవని ముఖేష్ అంబానీ చెప్పారు. ఏడాది ప్లాన్ తీసుకునే జియో కస్టమర్లకు హెచ్డీ 4k ఎల్ఈడీ టీవీ సెటప్ బాక్సులను కూడా ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు.