ఉద్ధవ్కు బిగ్ రిలీఫ్: మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తీపి కబురు: ఈ నెల 21న..
ముంబై: కరోనా కరాళ నృత్యాన్ని చేస్తోన్న వేళ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పదవీ గండాన్ని ఎదుర్కొంటోన్న సమయంలో.. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఆయనకు ఓ తీపి కబురును అందించారు. ఉద్ధవ్ థాకరే కుర్చీని కాపాడే కబురు అది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రకటన ఉద్ధవ్ థాకరే ఆనందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహాలు అనవసరం.
Recommended Video
పొలిటికల్ గేమ్: మహారాష్ట్ర గవర్నర్తో ఉద్ధవ్ థాకరే భేటీ: మండలికి ఎంపికపై వీడని సస్పెన్స్..
తొమ్మిది స్థానాలు ఖాళీ..
ప్రస్తుతం మహారాష్ట్ర శాసన మండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యేల కోటా కింద భర్తీ కావాల్సినవే. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఆ స్థానాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా అఘాడి కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు అయిదు స్థానాలు దక్కే అవకాశం ఉంది. వాస్తవానికి- ఖాళీ అయిన ఈ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని వాయిదా వేసింది. ఈ వాయిదా కాస్తా ఉద్ధవ్ థాకరేలో ఆందోళనలకు కారణమైంది.
ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్న ఉద్ధవ్ థాకరే ప్రస్తుతం అటు అసెంబ్లీలో గానీ ఇటు కౌన్సిల్లో గానీ సభ్యుడు కాదు. ముఖ్యమంత్రిగా లేదా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకుడు.. ఆరు నెలల వ్యవధిలో ఈ రెండింట్లో ఏదో ఒక సభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల గడువు ప్రస్తుతం సమీపించింది. గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 28వ తేదీలోగా ఆయన శాసన సభకు లేదా శాసన మండలికి ఎంపిక కావడం అనివార్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21వ తేదీన ఎన్నికలను నిర్వహించాలని కేంద్రం ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
గవర్నర్తో భేటీ అయిన కాస్సేపటికే..
శుక్రవారం ఉదయమే ఉద్ధవ్ థాకరే రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే ఈ ప్రతిపాదల విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనను శాసన మండలికి ఎంపిక చేయాలని మరోసారి నేరుగా గవర్నర్ను విజ్ఙప్తి చేశారని, దీనికి ఆయన ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదని తెలిసింది. ఇదే విషయంపై ఉద్ధవ్ థాకరే గురువారం నాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఫోన్ చేశారు. ప్రధానికి ఫోన్ చేయడం, మరుసటి రోజే గవర్నర్ను కలుసుకోవడం.. ఆ వెంటనే శాసన మండలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించడం వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
గవర్నర్ విజ్ఙప్తి మేరకు..
మహారాష్ట్రలో శాసన మండలి ఎన్నికలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్ కోష్యారి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం చాలా రకాల సడలింపులను ఇచ్చిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిపై అనిశ్చిత పరిస్థితి నెలకొందని, కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడటం సహేతుకం కాదని గవర్నర్ పేర్కొన్నారు.