రాహుల్ గాంధీకి మరో ఊరట.. రాజద్రోహం కేసు కొట్టివేత.. మోదీపై విమర్శలతో..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో కేసులో ఊరట లభించింది. రాజద్రోహం ఆరోపణలపై నమోదైన కేసును ఢిల్లీ కోర్టు శనివారం తోసిపుచ్చింది. 2016లో ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్గా చేసుకొని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన కేసును ఢిల్లీ కోర్టు కొద్దికాలంగా విచారిస్తున్నది. పిటిషన్ దారు అభ్యర్థనను అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విశాల్ పహుజా తోసిపుచ్చుతూ శనివారం తుది తీర్పు వెల్లడించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
మోడీపై రాహుల్ ధ్వజం
2016లో ప్రధాని నరేంద్రమోడీపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైనికుల రక్తాన్ని స్వప్రయోజనాలకు, రాజకీయాలకు ఉపయోగించుకొంటున్నారు. వారి త్యాగాన్ని వ్యాపారం చేస్తున్నారు అంటూ రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకోని రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది.
ఢిల్లీ పోలీసుల యాక్షన్ రిపోర్టు
ఢిల్లీ పోలీసుల దాఖలు చేసిన యాక్షన్ టేకెన్ రిపోర్టును కోర్టు పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టి తీర్పును వెల్లడించింది. తాజా తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పిటిషన్దారు కొద్దిరోజుల్లో సెషన్స్ కోర్టును అప్రోచ్ అవుతామని వెల్లడించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. వాటిపై మరోసారి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
పరువు నష్టం దావాకు అవకాశం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైన నేరం కాదు అని ఢిల్లీ పోలీసులు తమ యాక్షన్ టెకెన్ రిపోర్టులో పేర్కొన్నారు. కాబట్టి ఈ రాజద్రోహం కేసును అంత తీవ్రంగా పరిగణించకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాకపోతే ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేయవచ్చని సూచించింది.
రాఫెల్లోనూ రాహుల్కు ఊరట
ఇటీవల రాహుల్ గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. రాఫెల్ కేసులో ప్రధాని నరేంద్రమోడీని చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పిటిషన్ దాఖలు చేయడం, దానిని విచారించిన కోర్టు కొట్టివేయడం జరిగింది. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని రాహుల్ను కోర్టు హెచ్చరించింది.