నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతి
ముంబై: బాంబే హైకోర్టులో నెస్లే ఇండియా సంస్ధకు స్వల్ప ఊరట లభించింది. భారత్లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే ఇండియా చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరిచింది.
ఈ మేరకు బాంబే హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. మ్యాగీ నూడుల్స్లో సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి ఉన్నాయంటూ ఆహార భద్రత ప్రమాణాల సంస్ధ (ఎఫ్ఎస్ఎస్ఐ) తనిఖీల్లో రుజువైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మ్యాగీ ఉత్పత్తులపై జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మ్యాగీ ఉత్పత్తులన్నంటినీ ధ్వంసం చేయాలంటూ డిమాండ్ రావడంతో నెస్లే ఇండియా హైకోర్టుని ఆశ్రయించింది.
మ్యాగీ ఉత్పత్తులను ధ్వంసం చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించింది. తాజా తీర్పుతో నెస్లే ఇండియాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.