కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించండి: హిందూ మహాసభ
న్యూఢిల్లీ: అఖిల భారత హిందూ మహాసభ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశంలోని కరెన్సీ నోట్లపై ముద్రించిన జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ స్ధానంలో మరో ప్రముఖ సిద్దాంతకర్త బొమ్మలను ముద్రించాలని తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి అఖిల భారత హిందూ మహాసభ కార్యాధ్యక్షుడు కమలేష్ తివారీ ఒక లేఖ రాశారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఆ లేఖలో ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మాగాంధీ బొమ్మ స్ధానంలో వీర్ శివాజీ, మహారాణా ప్రతాప్, భారతరత్న బీఆర్ అంబేద్కర్ బొమ్మలను ఏర్పాటు చేయాలని కోరారు. మహాత్మా గాంధీని జాతిపితగా పేర్కొంటూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదని పేర్కొన్నారు.
కానీ, విద్యార్ధులకు ఆ విధంలా ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను వెంటనే పుస్తకాల నుంచి ఉపసంహరించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. ఇక సీతాపూర్ జిల్లాలో నాధురాం గాడ్సే గుడి నిర్మాణానికి ఈ నెల 30న పునాది రాయి వేయనున్నట్లు తెలిపారు.
జనవరి 30వ తేదీన 'శౌర్వ దివస్' గా పాటించాలని అఖిల భారత హిందూ మహాసభ ప్రకటించింది. ప్రస్తుతం జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 20 జిల్లాల్లో శౌర్వ దివస్ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారత హిందూ మహాసభ తీర్మానించింది.