భారతీయుడు కాదు : రాజన్పై ప్రధాని మోడీకి లేఖ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘరాం రాజన్పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే రాజన్ను ఆ పదవి నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్రమోడీకి సోమవారం లేఖ రాశారు. డాక్టర్ రాజన్ భారత ఆర్ధిక వ్యవస్థను నష్టాల బాట పట్టిస్తున్నారని తప్పుబట్టారు.
సోమవారం ప్రధాని మోడీకి రాసిన లేఖలో రాజన్ మానసికంగా ఆయన పూర్తి భారతీయుడు కాదని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన గ్రీన్ కార్డును ఆయన రెన్యువల్ చేయించుకోవడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగా భారత ఆర్ధిక వ్వవస్థకు నష్టం కలిగించేలా రాజన్ చర్యలు ఉన్నాయని అన్నారు.
రాజన్ తీసుకున్ననిర్ణయాల వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు దెబ్బతిన్నాయని, దేశంలో నిరుద్యోగిత పెరిగిందని ఆయన ఆరోపించారు. చికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పాఠాలు చెప్పే రాజన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా సేవలందించేందుకు సెలవు పెట్టారని, ఆయనను తిరిగి చికాగో పంపాలని స్వామి తన లేఖలో పేర్కొన్నారు.
యుపీఏ సారథ్యంలోని గత ప్రభుత్వం రాజన్ను నియమించిందని తన తాజా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు స్వామి వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విభేదించారు. గౌరవప్రదమైన సంస్థలను, ఆర్బీఐ గవర్నర్ పదవిని రాజకీయాల్లోకి లాగడం తగదని ఆయన అన్నారు.
మన్మోహన్ ఎంతో ఆలోచించే రాజన్ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించారని అన్నారు. కాగా ఇటీవల ఓ సమావేశంలో ప్రధాని మోడీ సైతం ఆర్బీఐ గవర్నర్ రాజన్పై బహిరంగంగానే పొగడ్తలు కురిపించారు. సంక్లిష్ట ఆర్థిక సమస్యలను ఖచ్చితంగా విశ్లేషించారని ప్రశంసించారు. కాగా, స్వామి వ్యాఖ్యలపై రాజన్ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదిలా ఉంటే రెండోసారి రాజన్ను ఆర్బీఐ గవర్నర్ నియమించడంపై నిర్వహించిన సర్వేలో రాజన్ ఖచ్చితమైన మనిషి అంటూ నెటిజన్లు కితాబిచ్చారు. కాగా, రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగియనుంది.