కేంద్రం వివాదాస్పద నిర్ణయం- సీబీఎస్ఈ సిలబస్ లో నోట్లరద్దు, లౌకికవాదం, పౌరసత్వం తొలగింపు...
కరోనా వైరస్ నియంత్రణ, పేదలను ఆదుకునే చర్యల్లో వైఫల్యంపై ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యాసంవత్సరం కుదింపు, సిలబస్ తగ్గింపు చేపడుతుండగా.. ఇందులో కీలకమైన పలు పాఠ్యాంశాలను తొలగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఇందులో భారతదేశ మౌలిక సూత్రాలైన లౌకికవాదం, పౌరసత్వం వంటి అంశాలు కూడా చోటు చేసుకోవడంతో విపక్షాలు కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. సిలబస్ తగ్గింపులో తొలగించాల్సిన అంశాలు ఇవేనా అంటూ మోడీ సర్కారును ప్రశ్నిస్తున్నాయి.
కరోనా కారణంగా సిలబస్ తగ్గింపు....
కరోనా మహమ్మారి విజృంభణతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ విద్యాసంస్ధలు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా చెప్పలేని పరిస్ధితి. విద్యాసంవత్సరం ఆరంభం కావాల్సిన సమయంలో పలు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో విద్యాసంస్ధల పునఃప్రారంభం కూడా వాయిదా పడుతోంది. దీంతో సీబీఎస్ఈ కూడా విద్యాసంవత్సరంలో భారీగా మార్పులు చేస్తోంది. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతున్నందున విద్యార్ధులపై భారం పడకుండా సిలబస్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్ధులకు అత్యవసరమైన పాఠాలను మాత్రమే ఉంచి మిగిలిన 30 శాతాన్ని సిలబస్ నుంచి తొలగిస్తోంది. 9 నుంచి 12 తరగతుల విద్యార్ధుల కోసం బుధవారం సీబీఎస్ఈ విడుదల చేసిన సిలబస్ కలకలం రేపింది.
కోతల్లో లౌకిక వాదం, పౌరసత్వం, నోట్ల రద్దు...
సీబీఎస్ఈ తాజా నిర్ణయం ప్రకారం తగ్గిన సిలబస్ లో పలు కీలక పాఠ్యాంశాలకు చోటు దక్కలేదు. ఇందులో లౌకిక వాదం, పౌరసత్వం, నోట్లరద్దు, జాతీయవాదం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలను సీబీఎస్ఈ తొలగించింది. వీటిలో లౌకికవాదం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలు దేశ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు కూడా. వీటితో పాటు మోడీ సర్కారు గతంలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కూడా ఉంది. తాజా మార్పుల ప్రకారం పదో తరగతి సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం-వైవిధ్యం, మతం, కులం, ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు వంటి పాఠ్యాంశాలు తొలగించారు. అలాగే 11వ తరగతిలో సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం, స్ధానిక ప్రభుత్వాల పురోగమనం వంటి అంశాలు తొలగించారు. 12వ తరగతిలో సరిహద్దు దేశాలతో భారత్ సంబంధాలు, సంస్కరణలతో ఆర్ధికాభివృద్ధి, దేశంలో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు పక్కనబెట్టారు,
కేంద్రంపై విపక్షాల ఫైర్...
కరోనా ముసుగులో సీబీఎస్ఈ సిలబస్ నుంచి లౌకికవాదం, జాతీయవాదం పాఠాలను తొలగించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని విపక్షాలు సూటిగా ప్రశ్నించాయి. సంక్షోభం పేరుతో దేశ మౌలిక స్వరూపం, భిన్నత్వాన్ని హరించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశాయి. పాఠ్యాంశాల తొలగింపు సిద్ధాంతపరంగా జరిగినట్లు ఉందని, విద్యావేత్తల సలహాల కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలబస్ తగ్గింపు పేరుతో రాజకీయ అజెండా అమలు చేస్తున్నారా అని కేంద్రాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చదుర్వేది ప్రశ్నించారు. అటు వామపక్షాలు, బీఎస్పీ కూడా కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి.
సీబీఎస్ఈ వివరణ...
తాజా సిలబస్ మార్పులపై వివాదం చెలరేగడంతో సీబీఎస్ఈ స్పందించింది. ఈ మార్పులు కేవలం 2020-21 విద్యాసంవత్సరానికి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. ఇది కేవలం తాత్కాలిక మార్పు మాత్రమేనన్నారు. వీటిని తిరిగి 2021-22 విద్యాసంవత్సరంలో చేరుస్తామని క్లారిటీ ఇచ్చారు. అయినా విపక్షాల నుంచి విమర్శలు ఆగడం లేదు. మరోవైపు సీబీఎస్ఈ సిలబస్ తగ్గింపు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్ధలు స్వాగతించాయి. అయితే తొలగించిన పాఠ్యాంశాలు నీట్, జేఈఈ వంటి జాతీయ స్ధాయి పోటీ పరీక్షల్లో ఉంటాయా లేదా అనే విషయాన్ని సీబీఎస్ఈ స్పష్టం చేయాలని డిమాండ్ చేశాయి.