షాకింగ్ : ప్రముఖ సామాజిక కార్యకర్త శీతల్ ఆమ్టే ఆత్మహత్య...?
దివంగత సామాజికవేత్త,పద్మవిభూషణ్ గ్రహీత బాబా ఆమ్టే మనవరాలు,ప్రముఖ సామాజిక కార్యకర్త శీతల్ ఆమ్టే సోమవారం(నవంబర్ 30) మృతి చెందారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆస్పత్రిలో ఆమె మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. శీతల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కథనాలు వస్తున్నప్పటికీ... ఆమె మృతిపై ఇంకా స్పష్టమైన సమాచారమేదీ రాలేదు.
చంద్రపూర్ జిల్లాలోని వరోరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దీపక్ మాట్లాడుతూ... సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసినట్లు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినందునా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. శీతల్ విషం తాగి ఆత్మహత్య చేసుకుందన్న కథనాలపై స్పందిస్తూ.. ఇప్పుడే ఆ విషయాన్ని ధ్రువీకరించలేమన్నారు.
వృత్తి రీత్యా వైద్యురాలైన శీతల్... ప్రస్తుతం చంద్రపూర్లోని ఆనంద్వన్లో ఉన్న మహారోగి సేవా సమితికి షీతల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.2016లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్గా ఆమెను గుర్తింపునివ్వడం విశేషం. అలాగే ఐరాస ఇన్నోవేషన్ ఫర్ పీస్ కార్యక్రమానికి శీతల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు.
గత కొంతకాలంగా మహారోగి సేవా ట్రస్ట్ కార్యకలాపాలపై శీతల్ కుటుంబంలో వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ట్రస్ట్ వ్యవహారాలపై ఐదేళ్ల క్రితం సోదరుడు కౌస్తుబ్కు శీతల్కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కౌస్తుబ్ అవకతవకలకు పాల్పడుతున్నారని శీతల్ ఆరోపణలు చేశారు. దీంతో ఐదేళ్ల క్రితం కౌస్తుబ్ మహారోగి సేవా ట్రస్ట్ను వదిలిపెట్టారు. ఆ తర్వాత మరికొందరిని కూడా శీతల్ ట్రస్ట్ బాధ్యతల నుంచి తప్పించారు.
కౌస్తుబ్ను తిరిగి ట్రస్ట్లోకి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు శీతల్,ఆమె భర్త గౌతమ్ ఒప్పుకోవట్లేదు. ఇదే క్రమంలో తమ బంధువు ప్రకాష్ ఆమ్టేపై శీతల్ ఫేస్బుక్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆ పోస్టును తొలగించారు. మహారోగి సేవా సమితి ఉద్యోగులు,ట్రస్ట్ మెంబర్స్పై ఆమె చేసిన ఆరోపణలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని ఆమ్టే కుటుంబం నవంబర్ 22న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే శీతల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. శీతల్ కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్తుండటం గమనార్హం.