రేణుకా చౌదరికి షాక్: ఎఐసిసి పదవి నుంచి ఉద్వాసన
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెసు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆమెను ఎఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించింది. అకస్మాత్తుగా కాంగ్రెసు అధిష్టానం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక గల కారణాలేమిటనేది తెలియడం లేదు. ఆ మధ్య కాలంలో రేణుకా చౌదరి ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. టివి చానెల్ ప్యానెల్ లిస్టు నుంచి కూడా ఆమెను తప్పించారు. మీడియాను సమన్వయం చేసుకోవడంలో రేణుకా చౌదరి విఫలమైనట్లు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ ఆలోచనా ధోరణిని ఆమె ప్రతిబింబించలేకపోతున్నారని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు ఇష్టమైన జట్టును ఏర్పాటు చేసుకునే క్రమంలో రేణుకా చౌదరిని ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమించుకున్నట్లు ప్రచారం సాగింది. ఆమె అప్పట్లో ఎఐసిసి అధికార ప్రతినిధిగా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆమెను తీవ్రంగా తప్పు పట్టారు.
సీమాంధ్రకు చెందిన రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. తాను ఖమ్మం జిల్లా బిడ్డనే అని చెప్పుకుంటున్నారు. అయితే, రేణుకా చౌదరితో ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి విభేదాలు తలెత్తాయి.
రేణుకా చౌదరి, రాంరెడ్డి వెంకటరెడ్డి పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాకు చెందినవారు కారని ఆయన చెబుతూ వచ్చారు. అయితే, ఇది మాత్రమే ఆమె ఉద్వాసనకు కారణమని చెప్పడానికి లేదు. జాతీయ స్థాయి రాజకీయాలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమెను తప్పించి ఉండవచ్చునని అంటున్నారు.