సాగు చట్టాలను చెత్త బుట్టలో పారేయడమే అంతిమ పరిష్కారం: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
సంస్కరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు 65వ రోజు కూడా కొనసాగాయి. అయితే రిపబ్లిక్ డే నాడు చోటుచేసుకున్న హింస.. ఇవాళ(శుక్రవారం) కూడా కొనసాగింది. సింఘు సరిహద్దులో స్థానికుల ముసుగులోని కొందరు రైతులపైకి రాళ్లు రువ్వడం, రైతులు తిరగబడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం గనుక ఉపేక్షిస్తే ఈ ఉద్రిక్తతలు దేశమంతటికీ విస్తరిస్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.
రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చర్చలు జరిపి, ఓ తుది నిర్ణయానికి రావాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను శాశ్వతంగా రద్దు చేయడమే అంతిమ పరిష్కారమని, వాటిని చెత్తబుట్టలో పారేయడమే అంతిమ పరిష్కారం అని చెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు కామెంట్లు చేశారు..
నిరసనలు చేస్తోన్న చోటు నుంచి రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించరాదని, రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందని రాహుల్ అన్నారు. అయితే, నిరసనల తీవ్రత పెరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంలేదని, సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలన్నదే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని, రైతులు, పేదల భూములకు రక్షణ కల్పించే 'భూసేకరణ చట్టాన్ని' హత్యచేసి మరీ ప్రధాని మోదీ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని రాహుల్ ఆరోపించారు. రైతుల జీవనాధారాన్ని కేంద్రం లాగేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఇక..
రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎర్రకోటలోనికి వెళ్లేందుకు కొందరికి ఎందుకు అనుమతిచ్చారో, వాళ్లను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదో, ఆ ఘటనల వెనుక కేంద్రం ఉద్దేశాలు మరేమైనా ఉన్నాయా అనే విషయాలు హోం మంత్రిని అడగాలని రాహుల్ పేర్కొన్నారు.