భారత్లో మరిన్ని దాడులు..ఈ సారి ఉగ్రవాదులు ఎలా దాడి చేస్తారో తెలుసా..?
ఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? పుల్వామాలో ఓ కారులో పేలుడు పదార్థాలతో జవాన్ల కాన్వాయ్పై దూసుకెళ్లిన ఉగ్రవాది... ఈ సారి భారత్లో ఎలాంటి దాడులు చేయనున్నారు..? నేవీ అధిపతి సునిల్ లాంబా చెబుతున్నదేమిటి..?
పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిపిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దారుణాన్ని మరవకముందే ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులు కూడా సముద్రమార్గం నుంచి జరుగుతాయని ఇందుకోసం కొందరిని ఉగ్రవాదులు తయారు చేస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. ఇండో పసఫిక్ నిపుణుల సమావేశంలో ప్రసంగించిన సునీల్ లాంబా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఉగ్రవాదులు పలు రూపకాల్లో దాడులు చేయనున్నారనే స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందని ఈసారి సముద్రమార్గం నుంచి ఈ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?
ఇక 26/11 ముంబైలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గాన్ని ఎంచుకున్నారు. భారత్కు చెందిన మత్స్యకారుల పడవను హైజాక్ చేసి ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని నేవీ ఛీఫ్ గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారని చెప్పిన సునీల్ లాంబా... కొన్ని దేశాలు మాత్రం ఈ దాడులను ఖండించటం లేదని చెప్పారు. మూడువారాల క్రితం పుల్వామాలో జరిగిన దాడులు కూడా కొత్త తరహా దాడులుగానే అభివర్ణించిన నేవీ ఛీఫ్... హింసను వేర్పాటు వాదులు సృష్టిస్తే ఆ హింసకు మద్దతుగా మరో దేశం నిలిచిందంటూ పాకిస్తాన్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.