బరాక్ ఒబామా పయనం: తాజ్ మహల్ చూడరు, సౌదీకి పయనం!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా శనివారం సాయంత్రం అమెరికా నుండి భారత్ బయలుదేరనున్నారు. ఆయన మూడు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. షెడ్యూల్లో తాజ్ మహల్ పర్యటన కూడా ఉంది. అయితే, ఇప్పుడు ఆయన షెడ్యూల్లో తాజ్ పర్యటన రద్దయింది.
ఆయన తాజ్ మహల్ను పర్యటించకుండానే కాస్త ముందుగా భారత్ పర్యటన ముగించనున్నారు. ఒబామా అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే పర్యటన ముగించే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెప్పారు.
కాగా, ఆగ్రాలో బరాక్ ఒబామా పర్యటిస్తారని ముందుగా భావించి.. అక్కడ 27వ తేదీన మూడు గంటల పాటు సెల్ ఫోన్లు పని చేయవని చెప్పారు. మొదట షెడ్యూల్లో ఆయన పర్యటన ఉండటంతో తాజ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రానిక్ జామర్లతో ఫోన్లను పని చేయకుండా చేద్దామని భావించారు. అయితే, ఇప్పుడు ఆయన తాజ్ పర్యటన రద్దయింది.
సౌదీ వెళ్లే అవకాశం
బరాక్ ఒబామా 27వ తేదీన ఢిల్లీ నుండి నేరుగా సౌదీ అరేబియా వెళ్లే అవకాశముంది.
ఒబామా రాకకు నిరసనగా
ప్రపంచ ప్రజల ప్రథమ శత్రువైన అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిధిగా పాల్గొంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్ని బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆయన రాకను నిరసిస్తూ జనవరి 26న భారత్ బంద్ పాటించాల్సిందిగా పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మీడియాకు ప్రకటన వెలువడింది.