భయానక వీడియో! వ్యక్తిని చితక్కొట్టి.. సజీవ దహనం! ‘లవ్ జిహాద్’కు సమాధానమా?
ఉదయ్పూర్: 'లవ్ జిహాద్' కు వ్యతిరేకంగా అంటూ.. ఓ వ్యక్తిని చితక్కొట్టి, ఆపైన సజీవ దహనం చేయడమేకాక.. ఆ దారుణాన్నంతా వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టాడో కిరాతకుడు. ఈ అత్యంత భయానక ఘటన రాజస్థాన్ రాజ్ సమంద్ జిల్లాలోని రాజ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ట్రీట్మెంట్ కోసం వస్తారు.. అందాల వల విసురుతారు, చిక్కుకున్నారో ఇంతేసంగతులు!
ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఘటనలో బాధితుడిని మహమ్మద్ భట్టా షైక్గా పోలీసులు గుర్తించారు. శంబూనాథ్ రాయ్గర్ అనే వ్యక్తి అతడిని కొట్టి చంపి.. ఆపైన సజీవ దహనం చేశాడు.
రాజ్సమంద్ జిల్లాలోని రాజ్నగర్ ప్రాంతంలో దేవి హెరిటేజ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ భట్టా షైక్ను శంబూనాథ్ రాయ్గర్ వ్యవసాయ పరికరంతో చితక్కొట్టి, ఆ తరువాత కిరోసిన్ పోసి తగలబెట్టాడు.
అంతేకాదు, ఈ ఘటన మొత్తాన్ని వీడియోగా చిత్రీకరించి.. ఇకమీదట ఎవరు 'లవ్ జిహాద్'కు పాల్పడినా ఇదే గతి పడుతుందని కూడా హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక మోటారుసైకిల్తోపాటు మరో స్కూటీ కూడా కనిపించడం చూస్తుంటే.. ఘటన జరిగే సమయంలో శంబూనాథ్ వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడని, జరిగినదంతా అతడే చిత్రీకరించాడని అనిపిస్తుంది.
రాజ్నగర్ ప్రాంతంలో దేవి హెరిటేజ్ రోడ్డు సమీపంలో సగం కాలిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందంటూ పోలీసులకు సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో తాము స్వాధీనం చేసుకున్నది ఆ వ్యక్తం మృతదేహమేనని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలించారు. చివరికి గురువారం ఉదయం శంబూనాథ్ రాయ్గర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈలోపు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన మరో వీడియోలో శంబూనాథ్ రాయ్గర్ తన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకు తాను అలా చేశానంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్సమంద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు చోటుచేసుకోకుండా ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ జిల్లాలో క్యాంప్ చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు.