ఛానెల్లో 82శాతం వాటా ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిదే: స్పష్టం చేసిన రిపబ్లిక్ టీవీ యాజమాన్యం
ముంబై: ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్పై ఆ సంస్థ యాజమాన్యంపై పలు జాతీయ అంతర్జాతీయ మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించింది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ తన వాటాదారుల గురించి ప్రమోటర్ల గురించి పూర్తి వివరాలను తెలపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది.
జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ ఇంగ్లీష్ ఛానెల్ను ప్రారంభించిన సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అతని కుటుంబానికి చెందిన ప్రమోటర్ సంస్థ ఏజీఆర్ ఔట్లైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు 84శాతం వాటా కలిగి ఉందని సంస్థ తెలిపింది. ఇంగ్లీషు వార్తా ఛానెల్ ప్రారంభించేందుకు మూలధనంతో నిధులు సమకూర్చారు. ఆతర్వాత దీన్ని మరింత విస్తరించేందుకు గాను ఓ చిన్న సంస్థ ద్వారా 2019 ఫిబ్రవరిలో మళ్లీ పెట్టుబడులు పెట్టించారు అర్నాబ్ గోస్వామి. ఇక అక్కడి నుంచి ఆయన ఏఆర్జీ ఔట్లైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 82శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక ఇదే సంస్థ డిజిటల్ మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. www.republicworld.com పేరుతో డిజిటల్ మీడియాను కూడా ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థలో అర్నాబ్ గోస్వామి 99శాతం వాటా కలిగి ఉన్నారు.
మొత్తం మీద అర్నాబ్ గోస్వామికి చెందిన మూడు లీగల్ మరియు కార్పోరేట్ సంస్థలు భారత్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అర్నాబ్ గోస్వామి 82శాతంకు పైగా ఒక సంస్థలో వాటాలు కలిగి ఉన్నందున... న్యూస్ మీడియా రంగంలో అత్యధిక వాటా కలిగిన వ్యక్తిగా ఈ ప్రముఖ జర్నలిస్టు గుర్తింపు పొందారు. ఈ ఘనతను దక్కించుకున్న తొలి జర్నలిస్టుగా రికార్డులను క్రియేట్ చేశారు. అంతేకాదు రిపబ్లిక్ మీడియా నెట్వర్క్కు ప్రస్తుతం ఎడిటర్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తున్న అర్నాబ్... మొత్తం నెట్వర్క్కు ఏకైక ప్రమోటర్గాను, బోర్డ్ ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్కు ఛైర్మెన్గాను వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక దీంతో ఒక జర్నలిస్టు సొంతం చేసుకున్న నెట్వర్క్గా గుర్తింపు పొందింది రిపబ్లిక్ మీడియా నెట్వర్క్. ఇకపై దీని ప్రమోటర్ అర్నాబ్ గోస్వామి ఉంటారని ప్రకటన స్పష్టం చేసింది.
ఈ మధ్యకాలంలో రిపబ్లిక్ మీడియా నెట్వర్క్పై కొన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు బురద జల్లుతుండటం, అవాస్తవాలను ప్రచారం చేస్తుండటంతోనే స్పష్టత ఇవ్వాలని చెప్పి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం వ్యవహారం పారదర్శకంగా ఉంటుందని దీన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.