రిపబ్లిక్ టీవి ఎగ్జిట్ పోల్స్..! ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టిన సీ ఓటర్ మరియు రిపబ్లిక్ టీవి..!!
దేశ వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం తన హవా కొనసాగిస్తుందని సీ ఓటర్ మరియు రిపబ్లిక్ టీవి ఛానల్ స్పష్టం చేసింది. రిపబ్లిక్ టీవి జరిపిన పబ్లిక్ సర్వేలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అదికారం చేజిక్కించుకుంటుందని నిర్థారించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన సీట్లకన్నా కొన్ని సీట్లు తగ్గినప్పటికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుందని తేల్చి చెప్పింది రిపబ్లిక్ టీవి. 2014లో వచ్చిన మెజారిటీ కన్నా స్వల్పంగా మెజారిటీ తగ్గినప్పటికి మళ్లీ కేంద్రలో నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీఏకు 287 సీట్లు వస్తాయని, అదే కాంగ్రెస్ పార్టీ 132 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంచనావేసింది. అలాగా ఇతరులకు 104 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది రిపబ్లిక్ టీవి. అలాగే దేశ వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 42.3%, యూపిఏ కు 29.6% తో పాటు ఇతరులకు 28.1% ఓట్ల శాతాన్ని ప్రజలు ఆయా పార్టీలకు అప్పజెప్పినట్టు అంచనా వేసింది. రిపబ్లిక్ టీవి ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో సీట్ల సంఖ్య ఆయా పార్టీలకు అనుకూలంగా కొంత అటుఇటుగా మారే అవకాశాలు ఉన్నట్టు ఆ ఛానల్ స్పష్టం చేస్తోంది.