కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ?: బ్యానర్లు: బీజేపీ మిత్రపక్ష పార్టీలో?: కర్ణిసేన ఓటుబ్యాంకు
అహ్మదాబాద్: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందా? ఆమెను తమ పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం సిద్ధంగా ఉందా? రాజ్పుత్ ఓటుబ్యాంకును ఆకట్టుకోవడానికి కంగనాను పార్టీలో చేర్చుకోవడానికి సన్నాహాలు పూర్తి చేసిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ, బీజేపీ మిత్రపక్షం మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కంగనా రనౌత్కు పార్టీ సభ్యత్వం ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
సాఫ్ట్ పోర్న్స్టార్: ఊర్మిళా మతోండ్కర్పై కంగనా ఫైర్: తల కోసుకుంటా గానీ: సన్నీలియోన్నూ
గుజరాత్లో బ్యానర్లు..
కంగనా రనౌత్ ఇటీవలే కేంద్రమంత్రి, ఆర్పీపీ అధినేత రామ్దాస్ అథవాలేను కలిశారు. ఆ సందర్భంగా రామ్దాస్ అథవాలే.. తమ పార్టీలో చేరాలని ఆమెకు విజ్ఙప్తి చేయగా.. సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. గుజరాత్కు చెందిన ఆర్పీఐ నాయకులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గుజరాత్లోని వడోదరాలో కంగనా రనౌత్ పేరు మీద పోస్టర్లు, బ్యానర్లను కట్టారు. ఆమె తమ పార్టీలో చేరడం ఖాయమని చెబుతున్నారు.
బీజేపీ అండగా..
మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోని మహా వికాస్ అగాఢి కూటమి సంకీర్ణ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్విన తరువాత..కంగనా రనౌత్ను భారతీయ జనతా పార్టీ చేరతీసే ప్రయత్నం చేసింది. కేంద్రం ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ భద్రతను కల్పించడం దీనికి ఓ నిదర్శనం. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పోల్చిన తరువాత కూడా బీజేపీ నేతలు ఆమెకు అండగా ఉండటానికి ప్రధాన కారణం.. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరే. శివసేనకు రాజకీయంగా ఇబ్బందులను సృష్టించడానికి కంగనా రనౌత్కు బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారనే విషయం బహిరంగ రహస్యమే.
ప్రాథమిక సభ్యత్వం ఇవ్వడానికి
ఈ పరిణామాల మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.. మరో అడుగు ముందుకేసింది. కంగనా రనౌత్కు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి, ఆర్పీఐ అధినేత రామ్దాస్ అథవాలేతో ఈ నెల 10వ తేదీన కంగనా రనౌత్ సమావేశం అయ్యారు. మహారాష్ట్రకు చెందిన పార్టీ ఆర్పీఐ. రాజకీయంగా ఎలాంటి మద్దతు కావాలన్నా తాము ఇస్తామని, దీనికి ప్రతిగా తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకోవాలని రామ్దాస్ కోరగా.. దానికి కంగనా అంగీకరించారని చెబుతున్నారు.
Recommended Video
రాజ్పుత్, కర్ణిసేన ఓటుబ్యాంకు కోసం..
ఈ కారణంతోనే వడోదరాలో ఆర్పీఐ బ్యానర్లలో కంగనా రనౌత్ ఫొటోలు వెలిశాయి. కంగనా, రామ్దాస్ భేటీకి సంబంధించిన ఫొటోలను వాటిల్లో ముద్రించారు. వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కంగనా రనౌత్ ఫొటోలను విస్తృతంగా వినియోగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కంగనా రనౌత్.. రాజ్పుత్ వంశానికి చెందిన వారు. కర్ణిసేన ఆమెకు మద్దతు ఇస్తోంది. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రాజ్పుత్ల ఓటుబ్యాంకు అధికం. కర్ణిసేన సంఖ్యాబలమూ ఎక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని గుజరాత్ స్థానిక స్థానికసంస్థల ఎన్నికల్లో కంగనా ఫేస్ వ్యాల్యూను ఆర్పీఐ తమకు అనుకూలంగా మలచుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.