దారి తప్పిన 'టీచర్' కు పనిష్మెంట్.. చిన్నారి అత్యాచారం కేసులో 'ఉరిశిక్ష'
జబల్పుర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వంకర బుద్దితో అభాసుపాలయ్యాడు. చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలో ఓ టీచర్ కు శిక్ష పడింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వచ్చే నెల రెండో తేదిన ఉరిశిక్ష అమలుకానుంది. 2018, జూన్ లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది.
విచక్షణ కోల్పోయి..!
మధ్యప్రదేశ్ లోని జబల్పుర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేంద్రసింగ్ గోండ్.. నాలుగేళ్ల చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018, జూన్ 30న ఆ చిన్నారిని అడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడి వికృత చేష్టలకు బలైన ఆ చిన్నారి.. స్పృహ కోల్పోయింది. దీంతో ఆ పాపను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ దొరకలేదు.
నెలల పాటు కోలుకోని చిన్నారి..!
అభం శుభం తెలియని చిన్నారి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డారు తల్లిదండ్రులు. ఆమె కోసం వెతకని చోటు లేదు. అలా చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో అడవిలో ఆమె జాడ కనిపించింది. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ చిన్నారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం అందించారు. చిన్నారిపై అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని తక్కువ సమయంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ప్రత్యేక హెలికాప్టర్ లో ఆ చిన్నారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే పేగులు బాగా దెబ్బతినడంతో చిన్నారి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎన్నో సర్జరీలు చేస్తే గానీ మామూలు స్థితికి రాలేని పరిస్థితి. అతి చిన్న వయసులో ఆమె శరీరంపై సర్జరీ తాలూకు మచ్చలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
పాపం పండింది.. ఉరిశిక్ష పడింది
చిన్నారి అని చూడకుండా పైశాచికంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తగిన శాస్తి జరిగింది. తప్పు చేసినోడికి పాపం తప్పదన్నట్లుగా చివరకు ఆ టీచర్ కు శిక్ష తప్పలేదు. ఈ ఘటనపై నాగోద్ సెషన్స్ కోర్టులో జరిగిన విచారణమేరకు 2018, సెప్టెంబరులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. జనవరి 25న హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారుచేస్తూ ఆదేశాలిచ్చింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చిన్నారులపై అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఇదే తొలి ఉరిశిక్ష అవుతుంది. మార్చి రెండో తేదిన నిందితుడికి ఉరిశిక్ష అమలు కానుంది.