ఫ్యాకల్టీ నియామకాల్లో ఆ కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే: ప్రభుత్వం
న్యూఢిల్లీ: అన్ని కేంద్రప్రభుత్వ విద్యాసంస్థల్లో జరిగే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇది ఐఐటీ ఐఐఎంలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్ పద్ధతులను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రమానవ వనరుల శాఖ దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో కేంద్రం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
చాలా సెంట్రల్ యూనివర్శిటీలు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ సందర్భంగా ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్ను అమలు చేస్తుండగా.. 7.5 శాతం ఎస్టీలకు అమలు చేస్తోంది. ఓబీసీలకు 27శాతం, 10శాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారికి అమలు చేస్తున్నాయి. అయితే ఐఐటీలు ఐఐఎంలు ఈ రిజర్వేషన్ల విధానాలను పాటించడం లేదని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర మానవవనరుల శాఖ దృష్టికి తీసుకొచ్చింది.
ఫ్యాకల్టీ విషయంలో ఐఐటీలు ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వ్యక్తుల ప్రాతినిథ్యం కనిపించడం లేదని చెప్పారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగానే తీసుకున్న లెక్కలని స్పష్టం చేసింది. ఫ్యాకల్టీ నియామకాల్లో కేంద్ర విద్యాసంస్థల చట్టంను అనుసరిస్తూ నియామకాలు చేపట్టాలంటూ గతవారమే అన్ని కేంద్ర విద్యాసంస్థలకు లేఖ రాసింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరగనున్న నియామకాల్లో రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలంటూ ప్రత్యేకమైన సందేశాన్ని అన్ని ఐఐఎంలు ఐఐటీలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. మార్చి 7, 2019న వచ్చిన కొత్త రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలని అందులో పేర్కొంది. ఫ్యాకల్టీ రిజర్వేషన్లలో గత ఆదేశాలను సస్పెండ్ చేసి కొత్త ఆదేశాలను పాటించాల్సిందిగా అన్ని ఐఐఎంలకు చెప్పినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు ఫ్యాకల్టీ నియామకాల్లో ఐఐఎంలు 1975 ఆదేశాలనే పాటిస్తున్నాయి.