ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కావు: ప్రకాశ్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు ఏఏపీ మద్దతు
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు స్పందించాయి. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం కేంద్రం పార్లమెంట్ ముందు పెట్టే అవకాశముంది.
చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. ఎన్నికలకు ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల నేతలు స్పందించారు.
ఇది ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా రిజర్వేషన్లు ఎలా కల్పిస్తుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకుందంటే అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంగా భావించాల్సి ఉంటుందన్నారు.
అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్లను అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ తప్పుబట్టారు. గతంలో ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కాలేదని చెప్పారు.
అగ్రవర్ణాల్లోని పేదల కోటాకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చింది. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇచ్చి వారికి న్యాయం చేయాలని ఏఏపీ నేత సంజయ్ సింగ్ అన్నారు.
ఈ రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఈ బిల్లును ఆమోదించాలని, లేకపోతే న్యాయస్థానం అడ్డుకుంటుందని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్లు మించితే కోర్టు తీర్పు ఆటంకం అవుతుందన్నారు. అదే జరిగితే కేంద్రం నిర్ణయం ఎన్నికల స్టంట్ అవుతుందని, అగ్రవర్ణాల్లో పేదలను మోసం చేసినట్టు అవుతుందన్నారు.