షాకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా, కొద్ది రోజులుగా ప్రభుత్వంతో ఢీ
ముంబై/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జీత్ పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు. గతంలోనే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పుడు రాజీనామా చేయలేదు. ప్రభుత్వంతో వివాదం ముదిరిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది.
తాను తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని, ఇప్పటికిప్పుడు ఆర్బీఐ గవర్నర్గా తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పని చేయడం పట్ల తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్గా పని చేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. తనకు సహకరించిన తోటి ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఉర్జిత్ పటేల్ 2016 నుంచి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఆయన పదవీకాలం 2019 సెప్టెంబర్ వరకు ఉంది. అంటే ఆయన దాదాపు పదినెలల ముందే రాజీనామా చేశారు. ఉర్జీత్ పటేల్ హయాంలోనే 2016లో నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.