అమ్మపై భక్తి: అసెంబ్లీలో జయలలిత సీటు ఖాళీయే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం అమ్మ జయలలితపై తన భక్తిప్రపత్తులను చాటుకుంటూనే ఉన్నారు. పది నెలల క్రితం జయలలిత వారసుడిగా ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. జయలలితకు సాటి ఎవరూ లేరనే విషయాన్ని ఆయన చాటడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలితకు కేటాయించిన కార్యాలయాన్ని ఆయన వాడడం లేదు. దాన్ని ఖాళీగానే ఉంచేశారు.
శాసనసభలో కూడా అంతకు ముందు జయలలిత ముఖ్యమంత్రిగా కూర్చున్న సీటును కూడా ఆయన ఖాళీగానే ఉచేశారు. అవినీతి ఆరోపణల కేసులో దోషిగా తేలి, అరెస్టయిన తర్వాత జయలలితపై శాసనసభ్యురాలిగా అనర్హత వేటు పడింది. ఆమె ప్రస్తుతం బెయిల్పై బయటే ఉన్నారు. తీర్పుపై పైకోర్టులో అపీల్ చేశారు.
జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులైన పన్నీర్ సెల్వమ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఏడ్చేశారు. పలువురు మంత్రులు కూడా కంటతడి పెట్టారు. పన్నీరు సెల్వమ్ను ఇతర మంత్రులు ముఖ్యమంత్రిగా కూడా సంబోధించడం లేదని అంటున్నారు.
అన్నాడియంకెకు సంబంధించినంత వరకు జయలలిత వారి నాయకురాలని, ప్రధాన కార్యదర్సి అని, ముఖ్యమంత్రిగా కూడా ఆమెనే వారు పరిగణిస్తారని అంటున్నారు. పన్నీరు సెల్వమ్ గతంలో కూడా జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2001లో వివిధ కేసుల్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.