2రాష్ట్రాలకా?: బాబుకు మోడీ ఫోన్, పనిచేయకుంటే ఔట్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఫోన్ చేశారు. చంద్రబాబు ఢిల్లీలో సీఐఐ కాన్ఫరెన్స్లో ఉండగా మోడీ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే ఆయన పక్కకు వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమం ఒక జాతీయ టీవీ చానల్లో లైవ్ ప్రసారమవుతోంది.
ప్రధాని నుంచి ఫోన్ అనగానే అప్పటికే జాతీయ మీడియాలో కేంద్ర మంత్రి మండలి విస్తరణ గురించి వార్తలు రావడంతో ప్రధాని ఫోన్ వార్త చర్చనీయాంశం అయ్యింది. ఆ టీవీ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇస్తూ ఈ అంశంపై ఒక స్పష్టత రావడానికి రెండు రోజులు పట్టవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నెల 9 వ తేదీ జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. తెలుగుదేశం పార్టీకి ఒక్క మంత్రి పదవి లభిస్తే రేసులో పలువురు ఉన్నారు. చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని అప్పుడే చర్చ సాగుతోంది.
కేంద్రమంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పనున్న పెట్రో కారిడార్, పెట్రోలియం విశ్వవిద్యాలయం తదితర అంశాల పైన సమావేశంలో వీరు చర్చించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గంగవరంలో ఎల్ఎస్జీ ఏర్పాటును కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. పెట్రోలియం విశ్వవిద్యాలయ స్థలం ఎంపికను త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్రం కలిసి భారీ మౌలిక వసతులు కల్పించవచ్చునని కేంద్రమంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా, కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి, తెలంగాణనుంచి మరొకరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న జరగనున్న విస్తరణలో.. కళంకితులైన వారిని కేబినెట్లోకి తీసుకోరాదని, అలాగే ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు బాగా పని చేయకపోతున్నట్టయితే వారిని తప్పించాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.