పోల్ మేనేజ్మెంట్: రూ.500 ఇచ్చారు..వేలికి ఇంకు పూశారు! ఇంకెలా ఓటేస్తారు?
లక్నో: పోలింగ్కు ముందు రోజు రాత్రి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు..ఓటరు స్లిప్పులను పంచుతారు. స్లిప్పులతో పాటు కరెన్సీ నోట్లను కూడా ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటరు స్లిప్పులు, కరెన్సీ నోట్లతోనే సరి పుచ్చుకోలేదు ఓ జాతీయ పార్టీ కార్యకర్తలు. నోటు కోసం చేయి చాచిన ఓటర్ల చూపుడు వేలికి ఇంకు పూసేశారు. ఓటు వేశారనడానికి గుర్తుగా అన్నమాట. ఈ ఇంకు గుర్తుతో పోలింగ్ బూత్లోకి వెళితే ఏం జరుగుతుందనేది మనకు తెలిసిన విషయమే. ఈ విధంగా- పదుల సంఖ్యలో ఓటర్లను ఓటు వేయనీకుండా చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో పోల్ మేనేజ్మెంట్లో భాగంగా.. ఇలాంటి అవలక్షణం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చోటు చేసుకున్నది ఉత్తర్ ప్రదేశ్లో. వేలికి బలవంతంగా ఇంకు గుర్తును పూసిన ఆ జాతీయ పార్టీ కార్యకర్తలు.. బీజేపీకి చెందిన వారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లోని చందౌలి జిల్లా తారా జీవన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తమ గ్రామానికి వచ్చారని, ఓటరు స్లిప్పులతో పాటు 500 రూపాయల నోట్లను ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు తమ వేళ్లపై ఇంకు పూశారని ఆరోపిస్తున్నారు. ఇంకు పూసిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఇక తాము ఓటు ఎలా వేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు వందమందికి పైగా ఇంకు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. వారందరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజలు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంటరిగా!
ఈ ఘటనపై చందౌలి జిల్లా సబ్ కలెక్టర్ కేఆర్ హర్ష్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇంకు బాధితులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తామని అన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఓ జాతీయ పార్టీ కార్యకర్తులు బలవంతంగా తమ వేళ్లపై ఇంకు మార్కు వేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని అన్నారు. సాంకేతిక కారణాలను బట్టి చూస్తే- పోలింగ్ ప్రారంభానికి ముందే ఇంకు పూసే అవకాశం లేదని, దీన్ని ఆధారంగా చేసుకుని, వారికి ఓటు వేయడానికి అనుమతి ఇస్తామని హర్ష్ తెలిపారు.
ఈ గ్రామంలో దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. దళితులు బీజేపీకి ఓటు వేయరనే ఉద్దేశంతోనే.. ఆ పార్టీ కార్యకర్తలు ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లు ఆరోపిస్తున్నారు. కాగా- చందౌలి లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీ చేతుల్లో ఉంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఇక్కడ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయన బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీలతో కూడిన మహాకూటమి తరఫున డాక్టర్ సంజయ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు.