ముంచుకొచ్చిన ముప్పును ముప్పై నిమిషాల్లో పరిష్కరించండి..!అదికారులకు కేజ్రీవాల్ ఆదేశాలు..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీ వాల్ ఏది చేసినా వినూత్నంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో అదికారులకు ఆదేశాలు జారీ చేసే విషయం దగ్గరనుండి రోడ్డు పక్కన టీ తాగే అంశం వరకూ అన్నీ ప్రత్యేకంగా చేస్తారు. ఇక ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి అదికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు సీఎం కేజ్రీ వాల్. వర్షాకాలం సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లపై నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు పడితే ఆ సమస్యలను కేవలం 30 నిమిషాల్లోగా పరిష్కరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. వర్షాకాలంలో ప్రజల నుంచి వచ్చే మౌలిక ఫిర్యాదులను 30 నిమిషాల్లోనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
ముంపు ప్రాంతాల సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు శనివారం హాజరు కావాలని, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఢిల్లీ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఏ ప్రాంతంలోనైనా మురుగు నీరు నిల్వ ఉండటం లాంటి సమస్యలుంటే వెంటనే టోల్ఫ్రీ నెంబరుకు లేదా వాట్సప్ నెంబరుకు పంపించాలని అధికారులు సూచించారు. మురుగు నీటి నిల్వతో దాదాపు 277 ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నాయని, అలాగే మరో 157 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో మాత్రం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.