సెంట్మెంట్ దెబ్బ: కేంద్రానికి శశికళ లేఖ
చిన్నమ్మ శశికళ సెంట్మెంట్ దెబ్బ కొట్టారు. తమిళుల మనోభావాలను గౌరవించి, పొంగల్ పర్వదినం రోజును సెలవుగా ప్రకటించాలని ఆమె కేంద్రాన్ని కోరారు
చెన్నై: చిన్నమ్మ శశికళ రాజకీయంగా పావులు కదుపుతూనే తమిళ ప్రజల మనస్సులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆమె తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆ విషయాన్ని తెలియజేస్తోంది.అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె ఆ లేఖ రాశారు.
పొంగల్ సెలవు దినాన్ని తప్పనిసరి సెలవుగా కాకుండా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకకటించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై ఆయన లేఖాస్త్రం సంధించారు. ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించే నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు.
కేంద్ర నిర్ణయం పొంగల్ పర్వదినానికి పెద్ద షాక్ అని, తమిళనాడులో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి సెలవు దినంగా ఉండేదని ఆమె గుర్తు చేశారు. పొంగల్ అన్ని కులాలవాళ్లు ఆ పర్వదినాన్ని జరుపుకుంటున్నారని, దాంతో మతపరమైన మనోభావాలు ముడిపడి ఉన్నాయని, ఆ పండుగను నిర్వహించుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించడం కేంద్రం విధి అని ఆమె అన్నారు.
ఈ ఏడాది పొంగల్ శనివారం వస్తున్నప్పటికీ ఆ పండుగను కేంద్రం గౌరవించి, తప్పనిసరి సెలవు దినంగా ప్రకటించాలని ఆమె అన్నారు. తమిళుల హక్కుల రక్షణ కోసం స్వర్గీయ జయలలిత ఎంతో కృషి చేశారని, ఆమె కృషికి తగిన విధంగా పనిచేసే విధంగా కేంద్రం సహకరించాలని, ఆ విషయంలో తమిళుల హక్కులను కాపాడాలని ఆమె అన్నారు.