తాజ్మహల్ను రక్షించండి లేదా కూల్చేయండి: కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: తాజ్మహల్ రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్ మహల్ నిర్వహణపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. జస్టిస్ లోకూర్, జస్టిస్ దీప్ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది.
ప్రభుత్వాల తీరుతో ఎంతో నష్టం
తాజ్మహల్ నిర్వహణ పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదని, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ ఛైర్మన్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈఫిల్ టవర్ కంటే అందమైంది.. కూల్చేయండి లేదా రక్షించండి
తాజ్మహల్.. టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ సులభంగా తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అంతేగాక, ప్రభుత్వ తీరును తప్పు పడుతూ.. ‘మీరు పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారా? లేక తాజ్మహల్ను కూల్చేస్తారా?' అంటూ కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది.
చర్యలు తీసుకుంటున్నాం
తాజ్మహల్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యల తాలూకు నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు.
ప్రత్యేక కమిటీ నియామకం
తాజ్ మహల్పై పరిశోధించడానికి, నష్టశాతాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని నియమించామని తెలిపారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని కోర్టుకు విన్నవించారు. అంతేగాక, తాజ్పై అధ్యయనం చేయడానికి కాన్పూర్ విశ్వవిద్యాలయ నిపుణుల సాయం కూడా తీసుకున్నామని న్యాయవాది కోర్టుకు వివరించారు.